Senior IRGC Officer: అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సీనియర్ అధికారి మృతి.. చివరి హెచ్చరికే సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కు చెందిన సీనియర్ అధికారి అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు. గల్ఫ్లో అమెరికా నౌకాదళ హక్కులపై సవాల్ విసురుతూ "శత్రువుకు త్వరలో సర్ప్రైజ్ ఎదురవుతుంది" అని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున అమెరికా-జియోనిస్ట్ దాడిలో తమ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనీ "శహీద్ అయ్యారు" అని IRGC ప్రకటించింది. "సాఫ్ట్ వార్"లో ఆయన ఇచ్చిన ఆలోచనలు, మోడళ్లు విప్లవ గార్డులకు మార్గదర్శకంగా కొనసాగుతాయని గార్డ్స్ పేర్కొన్నాయి.
వివరాలు
అమెరికా-ఇజ్రాయెల్కు నైనీ చివరి హెచ్చరిక
మరణానికి ముందు ఇచ్చిన చివరి ప్రకటనలో బ్రిగేడియర్ జనరల్ నైనీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యలను ఎగతాళి చేశారు. ఇరాన్ ఇక యురేనియం శుద్ధి చేయలేదని, బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయలేదని నెతన్యాహు చెప్పడాన్ని ఆయన తిరస్కరించారు. ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం కొనసాగుతున్నా తమ క్షిపణి పరిశ్రమ అత్యున్నత స్థాయికి చేరుకుందని నైనీ స్పష్టం చేశారు. యుద్ధ సమయంలో కూడా క్షిపణుల తయారీ ఆగలేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. "మన క్షిపణి పరిశ్రమకు పూర్తి మార్కులు ఇవ్వాలి. యుద్ధ పరిస్థితుల్లో కూడా ఉత్పత్తి కొనసాగుతోంది. అందువల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదు" అని ఆయన ఫార్స్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.
వివరాలు
అమెరికా-ఇజ్రాయెల్కు నైనీ చివరి హెచ్చరిక
"క్షిపణి రంగం అత్యున్నత స్థాయికి చేరింది. శత్రువుకు సర్ప్రైజ్లు ఎదురవుతాయి. యుద్ధం ముందుకు సాగేకొద్దీ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయి" అని నైనీ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నౌకాదళం పూర్తిగా నాశనం అయిందన్న వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. "అలా అయితే ధైర్యం ఉంటే పర్షియన్ గల్ఫ్లోకి మీ నౌకలను పంపండి" అని ఆయన సవాల్ విసిరారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన కొద్ది సేపటికే అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో నైనీ మరణించినట్లు IRGC ప్రకటించింది.
వివరాలు
ఇరాన్పై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
మధ్యప్రాచ్యంలో యుద్ధం మూడో వారంలోకి అడుగుపెట్టిన వేళ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇక యురేనియం శుద్ధి చేయలేదని, బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసే సామర్థ్యం లేదని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త చర్యలు ప్రారంభమైన తర్వాత మొదటిసారి ప్రత్యక్ష మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, "ఇరాన్ సామర్థ్యాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాం. వాటిని పూర్తిగా నేలమట్టం చేస్తాం" అని హెచ్చరించారు. ఇరాన్ ఇప్పటివరకు ఎన్నడూ లేనంత బలహీనంగా మారిందని, ఇజ్రాయెల్ మాత్రం ప్రాంతీయ శక్తిగా మాత్రమే కాకుండా కొందరి అభిప్రాయం ప్రకారం ప్రపంచ శక్తిగా ఎదిగిందని నెతన్యాహు వ్యాఖ్యానించారు.