Pakistan: పాకిస్థాన్లో సంచలనం.. లష్కర్ ఉగ్రవాదిని చంపిన కుటుంబ సభ్యులు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్లో సంచలన ఘటన చోటు చేసుకుంది. లష్కర్-ఎ-తొయ్బా (LeT)కి చెందిన కమాండర్ బిలాల్ ఆరిఫ్ సరాఫీని ఆయన కుటుంబ సభ్యులే కత్తితో పొడిచి, కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది. శనివారం ఈద్ నమాజ్ అనంతరం ఈ ఘటన జరిగినట్లు వర్గాలు వెల్లడించాయి. పంజాబ్ ప్రావిన్స్లోని మురిద్కే ప్రాంతంలో లష్కర్ ప్రధాన కేంద్రం సమీపంలో ఈ హత్య జరిగినట్లు సమాచారం. ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే కుటుంబ వివాదమే ఇందుకు కారణమై ఉండవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఘటనలో పాల్గొన్న కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Details
ధ్రువీకరించిన అధికారులు
ఈ ఘటనకు సంబంధించినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో బిలాల్ మృతదేహం కనిపిస్తున్నప్పటికీ వాటి నిజానిజాలను అధికారులు ధృవీకరించలేదు. బిలాల్ ఆరిఫ్ సరాఫీ మురిద్కేలోని ఉగ్రవాద శిబిరంలో నియామక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. యువకులను గుర్తించి, వారికి మతపరమైన సిద్ధాంతాలతో మేధోమార్పిడి చేసి ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సహించడం అతని ప్రధాన బాధ్యతగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే బిలాల్పై భారత్లో ఎలాంటి కేసులు లేవని సమాచారం.
Details
పాకిస్థాన్లో ఉగ్రవాదం పెరుగుదల
దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు అదే ముప్పుతో ఇబ్బందులు పడుతోంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (GTI) 2026 ప్రకారం, 2025లో ప్రపంచంలో అత్యధికంగా ఉగ్రవాద ప్రభావిత దేశంగా పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది. 2025లో పాకిస్థాన్లో మొత్తం 1,045 ఉగ్రదాడులు చోటుచేసుకోగా, 1,139 మంది మృతి చెందారు. మరో 1,595 మంది గాయపడ్డారు. అలాగే 655 మందిని బందీలుగా పట్టుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాసియాలో ఇతర దేశాల్లో పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ, పాకిస్థాన్లో మాత్రం ఉగ్రవాదం మరింత తీవ్రరూపం దాల్చింది.
Details
లోచిస్తాన్ ప్రావిన్సుల్లో ఉగ్రదాడులు అధికం
ప్రత్యేకంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలోచిస్తాన్ ప్రావిన్సుల్లో ఉగ్రదాడులు అధికంగా నమోదయ్యాయి. మొత్తం దాడుల్లో 74 శాతం, మరణాల్లో 67 శాతం ఈ రెండు ప్రాంతాల్లోనే జరిగాయి. ఇక తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ప్రధాన ఉగ్రసంస్థగా కొనసాగుతోంది. 2025లో ఈ సంస్థ ఒక్కటే 595 దాడులు చేసి, 637 మంది మరణాలకు కారణమైంది. ఇది దేశంలో జరిగిన మొత్తం ఉగ్ర మరణాల్లో 56 శాతంగా ఉంది.