Kyiv: కీవ్లో కాల్పుల కలకలం.. భారీగా మృతుల సంఖ్య.. మరికొందరికి గాయాలు: మేయర్ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ రాజధాని కీవ్లో శనివారం తీవ్ర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఓ గన్మన్ అనూహ్యంగా ప్రజలపై కాల్పులు జరపడంతో "అనేక మంది" మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారని కీవ్ మేయర్ విటాలి క్లిచ్కో తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి ప్రస్తుతం ఒక సూపర్మార్కెట్లో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతోందని మేయర్ వెల్లడించారు.
వివరాలు
భారీగా భద్రతా బలగాల మోహరింపు..
"సూపర్ మార్కెట్లో ఉన్న ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ఆపరేషన్ జరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడ కూడా కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి" అని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ పోలీస్ శాఖ కూడా స్పందించింది. కాల్పుల వల్ల ఇప్పటికే కొందరు గాయపడగా, "అనేక మంది మృతి చెందినట్లు" ప్రాథమికంగా నిర్ధారించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.