Loading...
Sajeeb Wazed Joy: భారత్ తూర్పున మరో పాకిస్థాన్ ఏర్పడింది.. షేక్ హసీనా కుమారుడి హెచ్చరిక
భారత్ తూర్పున మరో పాకిస్థాన్ ఏర్పడింది.. షేక్ హసీనా కుమారుడి హెచ్చరిక

Sajeeb Wazed Joy: భారత్ తూర్పున మరో పాకిస్థాన్ ఏర్పడింది.. షేక్ హసీనా కుమారుడి హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు, అవామీ లీగ్ సీనియర్ నేత సజీబ్ వాజెద్ జాయ్ బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశం ప్రస్తుతం "విఫల రాజ్యం"గా మారుతోందని, అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోకపోతే భవిష్యత్తులో ప్రాంతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత్ తూర్పు సరిహద్దులో మరో "పాకిస్థాన్"లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంటూ, ఇది భారత భద్రతకు అత్యంత ప్రమాదకరమని అన్నారు.

వివరాలు 

దేశంలో పాక్ ఐఎస్ఐ స్వేచ్ఛగా పనిచేస్తోందని ఆవేద‌న

అమెరికాలోని మేరీల్యాండ్ నుంచి న్యూఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్‌ను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడిన సజీబ్ వాజెద్ జాయ్, బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఎలాంటి అడ్డంకులు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఆరోపించారు.

అవామీ లీగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అరెస్టై జైళ్లలో ఉన్న వందలాది మంది ఉగ్రవాదులను ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.

హిజ్బ్ ఉత్-తహ్రీర్ వంటి నిషేధిత సంస్థలు ఇప్పుడు బహిరంగంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయని, అల్-ఖైదాతో సంబంధాలున్న వ్యక్తులు కూడా బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిణామాలు భారత్‌తో పాటు ప్రపంచ భద్రతకూ తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

వివరాలు 

అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక

"భారత్ తూర్పు సరిహద్దులో ప్రస్తుతం మరో పాకిస్థాన్ ఏర్పడినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇది భారత్‌కే కాదు,ప్రపంచానికీ మంచిది కాదు.ఇప్పుడే ఈ పరిస్థితిని అడ్డుకోకపోతే,భవిష్యత్తులో అంతర్జాతీయ ఉగ్రవాదుల కొత్త తరం బంగ్లాదేశ్ నుంచే పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది" అని సజీబ్ వాజెద్ జాయ్ వ్యాఖ్యానించారు.

ఈ అంశంపై భారత మీడియా అప్పుడప్పుడు కాకుండా నిరంతరం దృష్టి సారించాలని కూడా ఆయన కోరారు.

2024లో జరిగిన నిరసనల్లో మరణించిన వారి సంఖ్య విషయంలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు, ఐక్యరాజ్యసమితి అంచనాల మధ్య భారీ తేడా ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం 800మంది మరణించగా,ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఆ సంఖ్య 1,400గా ఉందని తెలిపారు.

ఈరెండు గణాంకాల మధ్య దాదాపు 600మంది వ్యత్యాసం ఉందని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

సజీబ్ వాజెద్ జాయ్ ఆరోపణలపై స్పందించని బీఎన్‌పీ ప్రభుత్వం

నిరసనకారులకు పూర్తి రక్షణ కల్పిస్తూ, వారు చేసిన హత్యలకూ మినహాయింపు కల్పించేలా తీసుకొచ్చిన 'ఇండెమ్నిటీ బిల్లు'ను ఆయన తీవ్రంగా విమర్శించారు.

అలాగే వేలాది మంది అవామీ లీగ్ కార్యకర్తలు, నాయకులను విచారణ లేకుండా, బెయిల్ అవకాశం కూడా ఇవ్వకుండా నిర్బంధించారని ఆరోపించారు.

వారిలో కొందరు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

అవామీ లీగ్‌కు మద్దతుగా ఉన్న జర్నలిస్టులు, మీడియా సంస్థల యజమానులను గత రెండేళ్లుగా జైళ్లలో ఉంచారని కూడా సజీబ్ వాజెద్ జాయ్ ఆరోపించారు.

అయితే ఆయన చేసిన ఈ ఆరోపణలపై బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉన్న బీఎన్‌పీ ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బంగ్లాదేశ్‌పై సంచలన ఆరోపణలు చేసిన సజీబ్ జాయ్

ADVERTISEMENT