Visa Premium Processing Fee: వీసా దరఖాస్తుదారులకు షాక్.. ప్రీమియం ఫీజులు పెంచిన యూఎస్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా హెచ్-1బీ, ఎల్-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచింది. ప్రస్తుతం ఉన్న 2,805 డాలర్ల ఫీజును 2,965 డాలర్లకు పెంచినట్లు ప్రకటించింది. ఈ పెంపు మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది. అంతేకాదు, ఇతర వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజుల్లో కూడా మార్పులు చేసింది. ఈ మేరకు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 2023 నుంచి జూన్ 2025 మధ్యకాలంలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఫీజులను పెంచినట్లు యూఎస్సీఐఎస్ స్పష్టం చేసింది. వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడానికి ప్రీమియం ప్రాసెసింగ్ సేవల కింద ఈ అదనపు రుసుమును వసూలు చేస్తారు.
Details
మరింత సమర్థవంతంగా ప్రీమియం ప్రాసెసింగ్ సేవలు
హెచ్-1బీ, ఎల్-1, ఓ-1, పీ-1, టీఎన్ వీసాలకు సంబంధించిన ఫారం I-129 కింద ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరుగుతుంది. అలాగే ఎఫ్-1, జే-1 వంటి వీసాలకు సంబంధించిన ఫారం I-539 విషయంలో ఫీజును 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెంచినట్లు ప్రకటించారు. ఈ ఫీజు పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రీమియం ప్రాసెసింగ్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఉపయోగిస్తామని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ నిర్ణయం ఇతర దేశాలతో పాటు భారత్కు చెందిన విద్యార్థులు, వృత్తి నిపుణులపై కూడా ప్రభావం చూపనుందని వెల్లడించింది.