
Cambodia-Thailand War: థాయ్లాండ్-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి..! కాల్పుల విరమణకు తిరస్కారం?
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదం తీవ్రంగా మారింది. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం కాల్పులు జరుపుకోవడం వల్ల ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్యను శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలని సూచించాయి. ఈ క్రమంలో కంబోడియా కీలక స్పందననిచ్చింది. తక్షణమే కాల్పులు ఆపాలని థాయ్లాండ్ను కోరింది. ఐక్యరాజ్యసమితికి కంబోడియా రాయబారి ఛీయా కియో మాట్లాడుతూ, షరతులు లేని కాల్పుల విరమణకు థాయ్లాండ్ ముందుకు రావాలని, సమస్యకు శాంతియుత పరిష్కారం కావాలని పునరుద్ఘాటించారు.
Details
మూడవ పక్షానికి అవసరం లేదన్న థాయ్లాండ్
ఇక ఈ వివాదానికి ముగింపు పలకడానికి మలేషియా మధ్యవర్తిత్వానికి సిద్ధమయ్యింది. మొదట థాయ్లాండ్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినప్పటికీ, తర్వాత ఎందుకో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని కంబోడియా నేతలు తెలిపారు. ఇక థాయ్లాండ్ వైఖరిపై ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. మూడవ పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. రెండు దేశాలు స్వతంత్రంగా సమస్యను పరిష్కరించగలవన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచ నాయకులు కాల్పుల విరమణ కోరుతున్నా, తమ రూటులోనే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.