
Kentucky: కెంటుకీలోని చర్చి, విమానాశ్రయంలో కాల్పులు.. దుండగుడితో సహా ముగ్గురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలు తరచూ చోటుచేసుకుంటూ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విచ్చలవిడిగా ఆయుధాలు లభ్యం అవుతుండటంతో దుండగులు అమాయక ప్రజలపై కాల్పులు జరుపుతూ రెచ్చిపోతున్నారు. ఇటీవల ఒక్క వారంలోనే కనీసం నాలుగు కాల్పుల సంఘటనలు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం ఓ ఘటన జరిగిన తరువాత,తాజాగా మరో ఉదంతం అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లెక్సింగ్టన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి బ్లూ గ్రాస్ ఎయిర్పోర్ట్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసు బృందం తమ సాధారణ పర్యవేక్షణ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న సమయంలో,ఒకరు తుపాకితో కనిపించాడు.
వివరాలు
ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు
పోలీసులను చూసిన వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయి, సమీపంలోని చర్చిలోకి ప్రవేశించాడు. ఆపై చర్చి పరిసరాల్లోనే అతను కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడిలో 72 ఏళ్ల వృద్ధ మహిళతో పాటు 32 ఏళ్ల యువతి మృతిచెందారు. అలాగే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు బాధ్యత వహించిన దుండగుడిని పోలీసులు వెంటనే స్పందించి, చర్చికి సమీపంలోనే కాల్చి హతమార్చారు.