LOADING...
Trump's tariff: ట్రంప్‌ విధానాలతో భారత్-అమెరికా బంధాలు దెబ్బతింటున్నాయి 
ట్రంప్‌ విధానాలతో భారత్-అమెరికా బంధాలు దెబ్బతింటున్నాయి

Trump's tariff: ట్రంప్‌ విధానాలతో భారత్-అమెరికా బంధాలు దెబ్బతింటున్నాయి 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలు విధించడం, హెచ్-1బీ వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అమెరికా వ్యాపార వాతావరణం దెబ్బతింటోందని, భారత్-అమెరికా ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలు కూడా బలహీనపడుతున్నాయని అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుమతి సుంకాల కారణంగా అమెరికా వ్యాపార సంస్థలు, వినియోగదారులు నష్టపోతున్నారని ప్రతినిధుల సభ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ స్పష్టంచేశారు. 'భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం: స్వేచ్ఛాయుత, అందరికీ అవకాశాలిచ్చే ఇండో-పసిఫిక్‌' అనే విషయంపై దక్షిణాసియా, మధ్య ఆసియా వ్యవహారాల ఉపసమితి నిర్వహించిన చర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

120 ఏళ్లలో తొలిసారిగా తమ వ్యాపారం సంక్షోభంలో..

"నేను ప్రాతినిధ్యం వహిస్తున్న వాషింగ్టన్‌ రాష్ట్రంలో ఒక కుటుంబం ఐదు తరాలుగా వ్యాపారం చేస్తోంది. ఆ కుటుంబ కంపెనీ భారత్‌ నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుని అమెరికాలో విక్రయిస్తుంటుంది. గత వారం నేను మాట్లాడినప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉందని తెలిసింది. భారీ సుంకాల కారణంగా భారత మార్కెట్‌ నుంచి కావలసిన స్థాయిలో ఉత్పత్తులు తెప్పించుకోలేకపోతున్నారు. దీని ఫలితంగా ధరలు పెంచి అమ్మకాలు చేయాల్సి వస్తోంది. 120 ఏళ్లలో తొలిసారిగా తమ వ్యాపారం సంక్షోభంలో పడిందని వారు బాధ వ్యక్తం చేశారు. దిగుమతులను తగ్గించడం లేదా విదేశాల్లోనే ఉత్పత్తి సేకరణ, తయారీ ప్రక్రియను మార్చే దిశగా చూడడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని కూడా చెప్పారు" అని ప్రమీలా జయపాల్‌ వివరించారు.

వివరాలు 

అమెరికా కంపెనీలకే నష్టం

ఇక మరో ప్రతినిధి అమీ బెరా కూడా ఇరు దేశాల ఆర్థిక, భౌగోళిక ప్రయోజనాల దృష్ట్యా మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడాలని ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాన్నే భారతీయులు కూడా వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్లకు పైగా ఫీజు విధించడం వల్ల అమెరికా కంపెనీలకే నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే, ప్రధానమంత్రి మోదీ ఇటీవల చైనా, రష్యా నేతలతో నిర్వహించిన భేటీలపై అమెరికా కాంగ్రెస్‌ గంభీరంగా ఆలోచిస్తోందని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

భారత్‌తో ఈ చర్యలు అమెరికాకే నష్టం 

అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు సిడ్నీ కమలాగర్‌-డోవ్‌ మాట్లాడుతూ, ట్రంప్‌ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు భవిష్యత్తులో ఆయనను "భారత్‌ను కోల్పోయిన అధ్యక్షుడు"గా నిలబెట్టే అవకాశముందని వ్యాఖ్యానించారు. దిగుమతి సుంకాలు, వీసా ఫీజుల పెంపు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం భారత్‌తో ఉన్న సంబంధాలను దూరం చేయడం వంటి చర్యలు అమెరికాకే నష్టకరమని అన్నారు. రక్షణ, ఇంధన, ఏఐ, స్పేస్‌ టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో భారత్‌ అమెరికాకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని గుర్తుచేశారు. క్వాడ్‌ కూటమిలో భారత్‌ పాత్ర ఎంతో ప్రధానమైందని, అయినప్పటికీ ట్రంప్‌ విధానాల వల్ల భారత్‌ రష్యా వైపు మరింతగా మొగ్గుచూపే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

క్వాడ్‌ సమావేశం వాయిదా

రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై 25 శాతం అదనపు సుంకం విధించడం, దాని ఫలితంగా ఈ ఏడాది జరగాల్సిన క్వాడ్‌ సమావేశం వాయిదా పడటం వంటి ఘటనలు దీనికి నిదర్శనమని తెలిపారు. అమెరికా టెక్‌, ఐటీ రంగాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి వీసా ఫీజులను పెంచడం ద్వారా ట్రంప్‌ చేస్తున్న అన్యాయం చైనాకు అనుకూలంగా మారుతోందని ఆమె విమర్శించారు.

వివరాలు 

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అత్యవసరం

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కొనసాగాలంటే భారత్‌తో అమెరికా బలమైన సంబంధాలు కలిగి ఉండాలని ప్రతినిధి బిల్‌ హుయిజెంగా అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతుండటంతో అనేక అమెరికా కంపెనీలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అత్యవసరం అని సూచించారు. చైనాను వ్యూహాత్మకంగా అడ్డుకోవాలంటే భారత్‌ సహకారం అత్యంత కీలకమని హుయిజెంగా పేర్కొన్నారు.

Advertisement