
Gaza Peace Plan: ట్రంప్ శాంతి ప్రణాళిక తొలి దశకు ఇజ్రాయెల్-హమాస్ అంగీకారం
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య రెండేళ్లుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు కనబడేలా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికలోని తొలి దశను ఇజ్రాయెల్, హమాస్ ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ పరిణామాన్ని ట్రంప్ "చారిత్రకమైనది, అపూర్వమైన ముందడుగు"గా అభివర్ణించారు. ఒప్పందం ప్రకారం హమాస్ తమ వద్ద ఉన్న బందీలందరినీ విడుదల చేయనుండగా, ఇజ్రాయెల్ తన సైనిక బలగాలను ముందుగా నిర్ణయించిన సరిహద్దు రేఖకు ఉపసంహరించుకోనుంది.
వివరాలు
చర్చల్లో కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్ట్, టర్కీ
ఈ ఒప్పందం ఈజిప్ట్లో జరిగిన చర్చల అనంతరం కుదిరిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో ప్రకటించారు. "మా శాంతి ప్రణాళికలోని తొలి దశకు ఇజ్రాయెల్, హమాస్ రెండూ ఆమోదం తెలిపినట్లు ప్రకటించడంలో నాకు గర్వంగా ఉంది. దీని ఫలితంగా బందీలందరూ త్వరలోనే విడుదలవుతారు. శాశ్వతమైన శాంతి వైపు తీసుకెళ్తున్న బలమైన తొలి అడుగుగా ఇజ్రాయెల్ తన సైన్యాన్ని అంగీకరించిన రేఖకు వెనక్కి తీసుకుంటుంది" అని ట్రంప్ తెలిపారు. ఈ చర్చల్లో మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, ఈజిప్ట్, టర్కీ దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
వివరాలు
త్వరలో ట్రంప్ మధ్యప్రాచ్య పర్యటన
అదే సమయంలో బందీలు-ఖైదీల మార్పిడి, గాజాలోకి సహాయక సామగ్రి ప్రవేశం వంటి అంశాలపై కూడా ఇజ్రాయెల్, హమాస్ మధ్య అవగాహన కుదిరిందని ఈజిప్ట్ ప్రభుత్వ అనుబంధ మీడియా ధృవీకరించింది. "దేవుడి దయతో మన బందీలను తిరిగి ఇంటికి తీసుకువస్తాం" అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం దాదాపు ఖరారవుతున్న నేపథ్యంలో, తాను త్వరలో మధ్యప్రాచ్య పర్యటన చేపట్టే అవకాశం ఉందని ట్రంప్ సూచించారు.
వివరాలు
గాజా ప్రాంతంలో 67,000 మందికి పైగా మృతి
ఈ ఒప్పందం వెలువడకముందే దక్షిణ గాజాలోని అల్-మవాసీ ప్రాంతంలో ప్రజలు "అల్లాహు అక్బర్" నినాదాలతో సంబరాలు జరుపుకున్నారని, గాల్లోకి కాల్పులు జరిపారని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు. 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. ఆ దాడిలో 1,219 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోగా, 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యల్లో గాజా ప్రాంతంలో 67,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.