Qantas: 2027 నుంచి సిడ్నీ-లండన్ మధ్య నాన్స్టాప్ విమాన సర్వీసులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ విమానయాన రంగం మరో కీలక మైలురాయిని చేరుకోబోతోంది. ఒకప్పుడు లండన్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ చేరుకోవడానికి దాదాపు రెండు వారాల సమయం, సుమారు 40 వరకు మధ్యంతర స్టాప్లు అవసరమయ్యేవి. అయితే ఆధునిక విమాన సాంకేతికత అభివృద్ధితో అదే ప్రయాణం ఇకపై కేవలం 22 గంటల్లోనే పూర్తికానుంది. ఆస్ట్రేలియా జాతీయ విమానయాన సంస్థ క్వాంటాస్ (Qantas) 2027 అక్టోబర్ నుంచి సిడ్నీ-లండన్ మధ్య నేరుగా నాన్స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో విమానయాన రంగం అల్ట్రా-లాంగ్-హాల్ ప్రయాణాల్లో కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది.
వివరాలు
'కంగారూ రూట్' నుంచి 'ప్రాజెక్ట్ సన్రైజ్' వరకు..
లండన్-సిడ్నీ మార్గాన్ని చారిత్రకంగా 'కంగారూ రూట్'గా పిలుస్తారు. 1930ల కాలంలో ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే తూర్పు యూరప్, మధ్యప్రాచ్యం, భారత ఉపఖండం, ఆగ్నేయాసియా దేశాల మీదుగా అనేక విమానాలు, రైళ్లు మారుతూ, రాత్రివేళల్లో బస చేస్తూ సుమారు 13 రోజులకు పైగా ప్రయాణించాల్సి వచ్చేది. 1950లలో జెట్ విమానాలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి ఎనిమిది స్టాప్లతో సుమారు 38 గంటలకు చేరుకుంది. అనంతరం బోయింగ్ 747 వంటి ఆధునిక విమానాలు అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం మరింత తగ్గింది. 2018లో పెర్త్-లండన్ మధ్య 17 గంటల నాన్స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించి క్వాంటాస్ మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది.
వివరాలు
ఆ దిశగా ప్రాజెక్ట్ సన్రైజ్ ముందడుగు..
అయితే సంస్థ లక్ష్యం అక్కడితో ఆగలేదు. ఆస్ట్రేలియాలోని ప్రధాన ఆర్థిక, జనాభా కేంద్రాలైన సిడ్నీ, మెల్బోర్న్ నగరాల నుంచి ప్రపంచంలోని ప్రధాన నగరాలకు నేరుగా విమానాలు నడపాలనే ఉద్దేశంతో 'ప్రాజెక్ట్ సన్రైజ్'కు శ్రీకారం చుట్టింది. "దూరం అనే పరిమితిని అధిగమించడమే క్వాంటాస్ ఆవిర్భావ లక్ష్యం. ఆ దిశగా ప్రాజెక్ట్ సన్రైజ్ కీలక ముందడుగు" అని క్వాంటాస్ సీఈఓ వెనెస్సా హడ్సన్ పేర్కొన్నారు.
వివరాలు
22 గంటల నాన్స్టాప్ ప్రయాణం ఎలా సాధ్యమైంది?
దాదాపు 17 వేల కిలోమీటర్ల దూరాన్ని ఎలాంటి విరామం లేకుండా 22 గంటల పాటు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా సాంకేతిక మార్పులు చేపట్టారు. ఎయిర్బస్ తయారు చేసిన ఏ350-1000 విమానాల్లో అదనపు ఇంధన ట్యాంకులు ఏర్పాటు చేయడంతో పాటు అధిక టేకాఫ్ బరువును మోయగల సామర్థ్యాన్ని పెంచారు. అలాగే విమానం గాలిలో మరింత సమర్థంగా ప్రయాణించేలా ఏరోడైనమిక్ రూపకల్పనను కూడా మెరుగుపరిచారు. సాధారణంగా 300 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లగల ఏ350 విమానాల్లో, ఈ సుదూర సర్వీసుల కోసం కేవలం 238 సీట్లనే ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సంఖ్య, లగేజీ బరువును తగ్గించడం ద్వారా విమానం ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అవసరమైన సామర్థ్యం లభిస్తుంది.
వివరాలు
సాంకేతికతతో పాటు ప్రయాణికుల ఆరోగ్యానికీ ప్రాధాన్యం..
22 గంటల పాటు విమానాన్ని నిరంతరంగా గాల్లో ఉంచడం కంటే, అంతసేపు ప్రయాణికులు సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉండేలా చూడడమే పెద్ద సవాల్గా క్వాంటాస్ భావించింది. ఈ అంశంపై సంస్థ అనేక సంవత్సరాలుగా శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహించింది. ముఖ్యంగా నిద్ర విధానం, జెట్ లాగ్ ప్రభావం, అలసట వంటి అంశాలపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టింది. దీనిలో భాగంగా కొత్త విమానాల్లో ప్రత్యేక 'వెల్నెస్ జోన్'ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతంలో ప్రయాణికులు నడవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా శరీరానికి విశ్రాంతి కల్పించుకోవచ్చు. గమ్యస్థానానికి అనుగుణంగా ప్రయాణికుల శరీర గడియారం అలవాటు పడేందుకు క్యాబిన్ లైటింగ్ను ప్రత్యేకంగా నియంత్రిస్తారు. అలాగే జెట్ లాగ్ ప్రభావాన్ని తగ్గించేలా భోజన సమయాలను కూడా శాస్త్రీయంగా ప్రణాళిక చేస్తారు.
వివరాలు
19 గంటల ప్రయాణం..
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ నాన్స్టాప్ వాణిజ్య విమాన సర్వీసుగా సింగపూర్-న్యూయార్క్ మధ్య సింగపూర్ ఎయిర్లైన్స్ నిర్వహిస్తున్న 19 గంటల ప్రయాణం నిలిచింది. అయితే 2027 నుంచి ప్రారంభం కానున్న సిడ్నీ-లండన్ 22 గంటల నాన్స్టాప్ సర్వీసుతో ఆ రికార్డును క్వాంటాస్ అధిగమించనుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, సిడ్నీ నుంచి న్యూయార్క్కు కూడా నేరుగా నాన్స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించే దిశగా క్వాంటాస్ అడుగులు వేస్తోంది. ఒకప్పుడు సాహసయాత్రగా భావించిన ఈ ప్రయాణం, త్వరలోనే ఒక సుదీర్ఘ విమాన ప్రయాణంగా మాత్రమే మిగిలిపోనుంది.