US-Iran: ఇరాన్పై అమెరికా భారీ ప్రతీకారం.. వైమానిక దాడులతో పాటు చమురు ఆంక్షలు మళ్లీ అమలు
ఈ వార్తాకథనం ఏంటి
హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిందనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా మరోసారి కఠిన చర్యలకు దిగింది. బుధవారం తెల్లవారుజామున అమెరికా సైన్యం ఇరాన్లోని పలు కీలక సైనిక స్థావరాలపై వరుస వైమానిక దాడులు నిర్వహించింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ముందే హెచ్చరించిన అమెరికా,ఇప్పుడు ఆ హెచ్చరికలను కార్యరూపంలోకి తీసుకొచ్చింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM)సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' (X) లో విడుదల చేసిన ప్రకటనలో, అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడినందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా, ఇరాన్ చర్యలు అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించినట్టేనని అమెరికా ఆరోపించింది.
వివరాలు
క్షిపణి కేంద్రాలు, డ్రోన్ స్థావరాలే ప్రధాన లక్ష్యాలు
ఈ వైమానిక దాడుల్లో ఇరాన్కు చెందిన పలు కీలక రక్షణ వ్యవస్థలను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా వైమానిక రక్షణ వ్యవస్థలు,తీర ప్రాంత నిఘా కేంద్రాలు,ఉపరితలం నుంచి గగనతలాన్ని లక్ష్యంగా చేసుకునే క్షిపణి వ్యవస్థలు,యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణి కేంద్రాలు,డ్రోన్ ప్రయోగ స్థావరాలపై దాడులు జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా,దక్షిణ ఇరాన్లోని సిరిక్,బందర్ అబ్బాస్ నగరాలు,ఖేష్మ్ దీవి పరిసరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. సిరిక్ వాణిజ్య నౌకాశ్రయంలో శత్రుక్షిపణి పడటంతో పలువురు గాయపడినట్లు స్థానిక నివేదికలు వెల్లడించాయి. ఈఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాక్ పర్యటనలో ఉన్న ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తన పర్యటనను మధ్యలోనే నిలిపివేసి అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
వివరాలు
మూడు చమురు ట్యాంకర్లపై క్షిపణి దాడులు
బ్రిటిష్ మిలిటరీ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (IMO) వివరాల ప్రకారం, ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న మూడు చమురు ట్యాంకర్లపై మంగళవారం క్షిపణి దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఒక ట్యాంకర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు వెల్లడించింది. అయితే, హార్ముజ్ జలసంధిలో తమ అనుమతి ఉన్న మార్గాలను పాటించకుండా నౌకలు ప్రయాణించడమే ఈ దాడులకు కారణమని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పరోక్షంగా పేర్కొంది.
వివరాలు
ఇరాన్ చమురుపై ఆంక్షలు మళ్లీ అమలు
నౌకలపై దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు విక్రయాలపై గతంలో సడలించిన ఆంక్షలను వెంటనే పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 21 వరకు ఇరాన్ చమురు విక్రయాలకు అనుమతి కల్పిస్తూ జారీ చేసిన 60 రోజుల ప్రత్యేక లైసెన్స్ను అమెరికా ట్రెజరీ శాఖ రద్దు చేసింది. దీంతో ఇరాన్ చమురు ఎగుమతులపై మరోసారి తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
వివరాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?
ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురు, సహజవాయువులో సుమారు ఐదింట ఒక వంతు హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రయాణిస్తుంది. ఇలాంటి కీలక సముద్ర మార్గంలో తాజా సైనిక ఉద్రిక్తతలు కొనసాగితే అంతర్జాతీయ నౌకాయాన రంగంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.