LOADING...
Kharg Island: డెడ్‌లైన్‌కు గంటల ముందు ఖార్గ్ దీవిపై అమెరికా దాడులు.. మధ్యప్రాచ్యంలో హై టెన్షన్!
మధ్యప్రాచ్యంలో హై టెన్షన్!

Kharg Island: డెడ్‌లైన్‌కు గంటల ముందు ఖార్గ్ దీవిపై అమెరికా దాడులు.. మధ్యప్రాచ్యంలో హై టెన్షన్!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2026
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. మంగళవారం అమెరికా సైన్యం ఇరాన్‌కు కీలకమైన చమురు కేంద్రం అయిన ఖార్గ్ దీవిపై పలు సైనిక లక్ష్యాలను దాడి చేసింది. ఈ విషయాన్ని ఒక అమెరికా అధికారి వెల్లడించగా, ముందుగా ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ ఈ దాడుల గురించి సమాచారం ఇచ్చింది. ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగిసే కొన్ని గంటల ముందు జరిగింది. ఈ గడువు ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల (అమెరికా సమయం)లోగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావాల్సి ఉంది.

వివరాలు 

శాశ్వతంగా యుద్ధం ముగించాలని డిమాండ్ చేసిన ఇరాన్ 

ఇక ఒక రోజు ముందే ట్రంప్,ఇరాన్ తన సీజ్‌ఫైర్ ప్రతిపాదనను తిరస్కరించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒప్పందానికి రాకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ మాత్రం తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా శాశ్వతంగా యుద్ధం ముగించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ ఘర్షణ ఆరు వారంలోకి ప్రవేశించింది. అమెరికా దాడుల అనంతరం ఇరాన్‌కు చెందిన Islamic Revolutionary Guard Corps (IRGC)తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇక సహనం ముగిసిందని ప్రకటిస్తూ,అమెరికా,దాని మిత్రదేశాల శక్తి వనరులపై దాడులు చేయగలమని హెచ్చరించింది. ప్రాంతీయంగా చమురు సరఫరాలో భారీ అంతరాయం కలగొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే ఎనర్జీ మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేస్తామని కూడా IRGC స్పష్టం చేసింది.

వివరాలు 

ఖార్గ్ దీవి ఇరాన్‌కు ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం

గత నెలలో కూడా అమెరికా ఖార్గ్ దీవిపై దాడులు చేసి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. నౌకాదళ మైన్స్ నిల్వలు,క్షిపణి బంకర్లను ధ్వంసం చేసినప్పటికీ, చమురు మౌలిక సదుపాయాలను పెద్దగా నష్టపరచలేదు. ఖార్గ్ దీవి ఇరాన్‌కు ప్రధాన చమురు ఎగుమతి కేంద్రంగా ఉండి, దాదాపు 90శాతం క్రూడ్ ఆయిల్ ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. ఇది ఇరాన్ తీరానికి సుమారు 26 కిలోమీటర్ల దూరంలో ఉండి, భారీ భద్రతా ఏర్పాట్లతో "నిషేధిత దీవి"గా కూడా పిలుస్తారు. ఫిబ్రవరి 28న అమెరికా,Israel కలిసి ఇరాన్‌పై దాడులు జరిపి అణు కార్యక్రమాన్ని అణిచివేయాలని ప్రయత్నించాయి. ఆ దాడుల్లో పలువురు కీలక నేతలు మరణించారని సమాచారం.

Advertisement

వివరాలు 

వరుసగా గడువులను పెంచుతున్న ట్రంప్ 

దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసి, హార్ముజ్ జలసంధిని మూసివేసింది. అలాగే అక్కడుగా వెళ్తున్న నౌకలపై కూడా దాడులు చేసింది. ఇక ట్రంప్ వరుసగా గడువులను పెంచుతూ వస్తున్నారు. మొదట 5 రోజుల గడువు ఇచ్చిన ఆయన, తరువాత 10 రోజులకు పొడిగించారు. తాజాగా ఈ గడువు ఏప్రిల్ 7 వరకు కొనసాగింది. మొదట 48 గంటల హెచ్చరికగా ప్రారంభమైన ఈ వ్యవహారం ఇప్పుడు 400 గంటలకు పైగా సాగింది. ఒప్పందం జరగకపోతే ఇరాన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలపై పూర్తి స్థాయి దాడులు జరిపే అవకాశముందని ట్రంప్ హెచ్చరించారు. సోమవారం కూడా ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

వివరాలు 

ఒప్పందానికి రాకపోతే భారీ పరిణామాలు: ట్రంప్ 

ఒప్పందానికి రాకపోతే భారీ పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇరాన్ అమెరికా ప్రతిపాదనను తిరస్కరించి, పాకిస్తాన్ ద్వారా తన స్పందనను పంపింది. తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళికలో ప్రాంతీయ ఘర్షణలకు ముగింపు, హోర్ముజ్ జలసంధిలో సురక్షిత రవాణా, ఆంక్షల ఎత్తివేత, యుద్ధానంతర పునర్నిర్మాణానికి హామీలు వంటి అంశాలు ఉన్నాయి.

Advertisement