LOADING...
US-Israel Strikes On iran : అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. హోర్ముజ్ మూసివేత ప్రభావం.. భారత్ ఎలా ప్రభావితమవుతుంది?
అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. హోర్ముజ్ మూసివేత ప్రభావం.. భారత్ ఎలా ప్రభావితమవుతుంది?

US-Israel Strikes On iran : అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. హోర్ముజ్ మూసివేత ప్రభావం.. భారత్ ఎలా ప్రభావితమవుతుంది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, అమెరికా దాడులు - వాటికి ఇరాన్ ప్రతిదాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారతదేశంపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన భద్రత విషయంలో భారత్ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాల్లో సుమారు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం చమురు సరఫరాపై ప్రభావం చూపవచ్చు.

Details

హోర్ముజ్ జలసంధి ప్రాధాన్యం

మధ్యప్రాచ్యంలో అత్యంత కీలక సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి(Strait of Hormuz) ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20-25 శాతం రవాణాకు మార్గం కల్పిస్తుంది. పర్షియన్ గల్ఫ్ ప్రవేశద్వారంలో ఉన్న ఈ జలసంధి ఉత్తరాన ఇరాన్, దక్షిణాన యుఏఈ మరియు ఒమాన్ దేశాల మధ్య విస్తరించి ఉంది. ఇది సుమారు 100 మైళ్ల పొడవు కలిగి ఉండగా, అత్యంత సన్నని ప్రాంతం కేవలం 21 మైళ్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. సముద్ర లోతు తక్కువగా ఉండటం వల్ల నౌకలు నావికా మైన్లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. గతేడాది రోజుకు సగటున 20 మిలియన్ బ్యారెల్స్‌కు పైగా ముడి చమురు, కండెన్సేట్లు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు ఈ మార్గం గుండా రవాణా అయ్యాయి.

Details

హోర్ముజ్‌పై భారత్ ఆధారిత్యం పెరుగుదల

కేప్లర్ (Kpler) అనే గ్లోబల్ డేటా సంస్థ వివరాల ప్రకారం, గత కొన్ని నెలల్లో భారత్ మళ్లీ మధ్యప్రాచ్య దేశాల నుంచి చమురు దిగుమతులు పెంచుకోవడంతో హోర్ముజ్ మార్గంపై ఆధారిత్యం పెరిగింది. కేప్లర్ నౌకల ట్రాకింగ్ డేటా ప్రకారం రోజుకు సుమారు 2.5-2.7 మిలియన్ బ్యారెల్స్ చమురు భారత్‌కు హోర్ముజ్ మార్గం గుండా వస్తోంది. ఇది మొత్తం దిగుమతుల్లో సుమారు 50 శాతం. ఇవి ప్రధానంగా ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ దేశాల నుంచి వస్తున్నాయి. రష్యా నుంచి దిగుమతులను కొంత మేర తగ్గించడంతో గల్ఫ్ దేశాల వాటా పెరిగిందని కేప్లర్ విశ్లేషకుడు సుమిత్ రిటోలియా తెలిపారు. దీంతో హోర్ముజ్‌లో ఎలాంటి అంతరాయం వచ్చినా భారత్ తక్షణ ప్రభావానికి లోనవుతుంది.

Advertisement

Details

హోర్ముజ్ మూసివేత సాధ్యమేనా?

ఇరాన్ ఇప్పటికే హోర్ముజ్‌ను ఆంక్షించిందనే వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ధృవీకరణ లేదు. అయితే ఆ ప్రాంతంలో నౌకలకు 'దాటరాదు' అనే రేడియో సందేశాలు వస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అమెరికా కూడా తన వాణిజ్య నౌకలకు గల్ఫ్ ప్రాంతాన్ని నివారించాలని సూచించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇరాన్ పూర్తిగా హోర్ముజ్ మూసివేయడం కష్టం. ఎందుకంటే అది తమ స్వంత చమురు ఎగుమతులకే నష్టం కలిగిస్తుంది. అయినప్పటికీ ప్రమాద భావన పెరిగితే నౌకలు ఆ మార్గాన్ని ఉపయోగించడంలో వెనుకంజ వేయవచ్చు. కేప్లర్ అంచనా ప్రకారం పూర్తిస్థాయి దీర్ఘకాల మూసివేత అవకాశాలు తక్కువే. తాత్కాలిక ఆలస్యాలు, మార్గమార్పులు, భద్రతా తనిఖీలు పెరగడం వంటి పరిణామాలే ఎక్కువగా కనిపించవచ్చు.

Advertisement

Details

భారత్‌కు ధరల షాక్?

సుమిత్ రిటోలియా విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం పరిస్థితుల్లో మొదటి ప్రభావం సరఫరాపై కాకుండా ధరలపై ఉంటుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ చమురు ధరలు పెరగవచ్చు. అలాగే రవాణా ఛార్జీలు, యుద్ధ ప్రమాద బీమా ప్రీమియాలు కూడా పెరుగుతాయి. ఫిజికల్ కొరత లేకపోయినా, దిగుమతి ఖర్చు పెరిగి భారత్ చమురు దిగుమతి బిల్లుపై భారం పడుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

Details

రష్యా చమురు మళ్లీ ప్రాముఖ్యం

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లుకోయిల్, రోస్‌నెఫ్ట్ వంటి రష్యా చమురు సంస్థలపై ఆంక్షలు విధించిన తర్వాత భారత్ రష్యా దిగుమతులు తగ్గించింది. అయితే హోర్ముజ్‌లో అంతరాయం ఏర్పడితే భారత రిఫైనరీలు మళ్లీ రష్యా చమురు వైపు మళ్లే అవకాశం ఉందని కేప్లర్ పేర్కొంది. ఇండియన్ ఓషన్, అరేబియన్ సముద్ర ప్రాంతాల్లో ఇప్పటికే తేలియాడుతున్న నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

Details

వైవిధ్యమైన దిగుమతులు భారత్‌కు రక్షణ

భారత్ ప్రస్తుతం 40కి పైగా దేశాల నుంచి చమురు దిగుమతి చేస్తోంది. రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా చమురు కొనుగోలు చేస్తోంది. అయితే అట్లాంటిక్ ప్రాంతాల నుంచి వచ్చే చమురు ప్రయాణ కాలం 25-45 రోజులు పడుతుంది. గల్ఫ్ నుంచి వచ్చే చమురుకు కేవలం 5-7 రోజులు మాత్రమే పడుతుంది. కాబట్టి మధ్యప్రాచ్య చమురు లాజిస్టిక్ పరంగా భారత్‌కు ఇప్పటికీ అత్యంత కీలకం.

Details

వ్యూహాత్మక నిల్వలు

అత్యవసర పరిస్థితుల్లో భారత్ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను వినియోగించే అవకాశం ఉంది. అదనంగా రిఫైనరీలు, డిపోలు, పోర్టులు డీజిల్, పెట్రోల్, ఏటీఎఫ్, ఎల్పీజీ వంటి ఉత్పత్తుల నిల్వలను నిర్వహిస్తుంటాయి. ఇంధన ధరలు వెంటనే పెరగవచ్చని భావించాల్సిన అవసరం లేదని కేప్లర్ అభిప్రాయపడింది. ధరలు నియంత్రణలో ఉన్నప్పటికీ, దీర్ఘకాలం అధిక స్థాయిలో నిలిస్తేనే రిటైల్ ధరలపై ప్రభావం కనిపించవచ్చు. ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే భారత్‌కు తక్షణ ప్రమాదం సరఫరా నిలిచిపోవడం కాకుండా, ధరల పెరుగుదల వల్ల ఆర్థిక ఒత్తిడి పెరగడమే ప్రధాన ఆందోళనగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement