LOADING...
Marco Rubio: పాక్‌తో సంబంధాలు బలోపేతం చేస్తాం.. భారత్‌తో స్నేహాన్ని దెబ్బతీయవు: అమెరికా 
పాక్‌తో సంబంధాలు బలోపేతం చేస్తాం.. భారత్‌తో స్నేహాన్ని దెబ్బతీయవు: అమెరికా

Marco Rubio: పాక్‌తో సంబంధాలు బలోపేతం చేస్తాం.. భారత్‌తో స్నేహాన్ని దెబ్బతీయవు: అమెరికా 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించాలన్న ఉద్దేశం అమెరికాకు ఉందని.. అయితే ఈ చర్య భారత్‌తో ఉన్న చారిత్రక, కీలక సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పష్టం చేశారు. 'ఆసియాన్‌' సమావేశాల నిమిత్తం మలేసియాలో ఉన్న రుబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో భేటీ కావడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతుల అంశాన్ని ప్రస్తావిస్తూ, కేవలం మాస్కోపై ఆధారపడకుండా అనేక దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలనే నిర్ణయం భారత్‌ ఇప్పటికే వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

పాకిస్థాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ప్రయత్నం

రుబియో మాట్లాడుతూ, "పాకిస్థాన్‌-అమెరికా సంబంధాల విషయంలో భారత్‌కు ఉండే ఆందోళన సహజమే. అయినప్పటికీ, ప్రతి దేశం తన ప్రయోజనాల దృష్ట్యా వివిధ దేశాలతో సంబంధాలు కొనసాగించాలనే అంశాన్ని భారత్‌ కూడా బాగా అర్థం చేసుకుంటుంది. పాకిస్థాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ, దీని వలన భారత్‌తో ఉన్న మా మైత్రి లేదా సహకారం దెబ్బతింటుందని అనుకోవడం తప్పు. వాషింగ్టన్‌-దిల్లీ మధ్య ఉన్న సంబంధాలు చారిత్రకమైనవి, దౌత్యపరంగా ఎంతో ప్రాధాన్యమున్నవి. భారతీయులు దౌత్యరంగంలో అత్యంత పరిణతి చెందినవారని నేను విశ్వసిస్తున్నాను. అంతేకాకుండా, అమెరికా నేరుగా సంబంధం లేని దేశాలతో కూడా భారత్‌ సంబంధాలు కొనసాగిస్తోంది. ఇది ఒక ఆచరణాత్మక, సమతుల్య విదేశాంగ విధానం భాగం," అని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

ట్రంప్‌ ప్రకటనను సమర్ధించిన పాక్ ప్రధాని 

ఇటీవలి నెలల్లో అమెరికా-పాకిస్థాన్‌ సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయని రిపోర్టులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌ సైన్యాధిపతి అసిం మునీర్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలిసిన తరువాత ఈ పరిణామం వేగం అందుకుందని అంచనా. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన ఉద్రిక్తతను తాను తగ్గించానని ట్రంప్‌ ఇటీవల చెప్పగా, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా ఆ వాదనను సమర్థించారు. కానీ భారత్‌ మాత్రం ఆ ప్రకటనలను మొదటినుంచి తిప్పికొడుతోంది. ఇదిలా ఉంటే, రష్యా నుంచి భారత్‌ పెద్దమొత్తంలో చమురు దిగుమతులు జరుపుతోందనే కారణంతో అమెరికా భారత్‌పై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.