BRICS Summit 2026: విభేదాలను వివాదాలుగా మారనీయం.. భారత్-చైనా సంబంధాలపై కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
భేదాలను వివాదాలుగా మారనీయబోమని ఇండియా, చైనా అధినేతలు నరేంద్ర మోదీ, షీ జిన్పింగ్ స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, పరస్పర హితం, పరస్పర ప్రయోజనం అనే మూడు సూత్రాల ప్రాతిపదికన ఇరు దేశాల సంబంధాలు మరింత పరిఢవిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఒకరి బలం నుంచి మరొకరు పాఠాలు నేర్చుకుంటూ సమష్టి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక సమావేశం శనివారం జరిగింది. భారత భూభాగంపై ఇరువురు నేతలు చర్చలు జరపడం 2019 తర్వాత ఇదే తొలిసారి.
వివరాలు
అంగీకరించిన నేతలు
ఇరు దేశాల మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలకు అతీతంగా సత్సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ సమాలోచనలు జరిగాయి.
భారత్, చైనా మధ్య అనుబంధాన్ని వ్యూహాత్మకంగా, దీర్ఘకాలిక దృక్పథంతో మరింత బలోపేతం చేసుకోవడానికి అగ్ర నేతలిద్దరూ అంగీకరించారు.
చర్చలను కొనసాగించడం ద్వారా విభేదాలను తగ్గించుకుంటూ.. సహకారానికి అవకాశమున్న రంగాలను విస్తరించుకోవాలని నేతలు నొక్కి చెప్పినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
వివరాలు
సరిహద్దు భద్రతే సంబంధాల దృఢత్వానికి కీలకం
జిన్పింగ్తో ప్రధాని మోదీ జరిపిన చర్చల్లో సరిహద్దు అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కీలకమని మోదీ పేర్కొన్నారు.
సరిహద్దు వివాదాలకు సంబంధించి ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలకు ఇరుపక్షాలూ కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. మరోవైపు మోదీ, జిన్పింగ్ మధ్య జరిగిన చర్చల్లో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల నిర్మాణం కూడా ప్రస్తావనకు వచ్చింది.
వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ఇరుపక్షాల మధ్య నెలకొన్న ఆందోళనలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలూ అంగీకరించాయి.
ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన మార్కెటింగ్ అనుమతులు, ఇతర తత్సంబంధ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇరువురు నేతలు కోరుకున్నారు.