Saudi Arabia: పశ్చిమాసియా సంక్షోభం.. సౌదీ అరామ్కో రిఫైనరీపై డ్రోన్ దాడి!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అరాంకో రిఫైనరీపై డ్రోన్ దాడి చోటుచేసుకుంది. ఈ రిఫైనరీ ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్టు సమీపంలో ఉంది. ఈ దాడి కారణంగా భారీగా మంటలు చెలరేగగా, రిఫైనరీకి కొంత నష్టం వాటిల్లినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేదా అన్న వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. యుద్ధ పరిస్థితుల మధ్య హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో సౌదీ అరేబియా ఎర్ర సముద్రం మార్గం ద్వారా చమురు రవాణా కొనసాగిస్తోంది.
Details
రాస్ లఫాన్ పారిశ్రామిక నగరంపై ఇరాన్ దాడి
ఈ కీలక మార్గంపైనే ఇప్పుడు దాడి జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఖతార్లోని అత్యంత ముఖ్యమైన రాస్ లఫాన్ పారిశ్రామిక నగరంపై కూడా ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా కువైట్లోని చమురు శుద్ధి కేంద్రాలపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ముందుగా మిన్ అల్ అహ్మదీ రిఫైనరీపై డ్రోన్ దాడి జరగడంతో భారీ మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. అనంతరం మరో రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని మరోసారి డ్రోన్ దాడి జరగడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.