LOADING...
Iran War: పశ్చిమ ఆసియా యుద్ధం.. 40కి పైగా ఇంధన క్షేత్రాలు ధ్వంసం: ఐఈఏ చీఫ్ కీలక హెచ్చరిక
40కి పైగా ఇంధన క్షేత్రాలు ధ్వంసం: ఐఈఏ చీఫ్ కీలక హెచ్చరిక

Iran War: పశ్చిమ ఆసియా యుద్ధం.. 40కి పైగా ఇంధన క్షేత్రాలు ధ్వంసం: ఐఈఏ చీఫ్ కీలక హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 23, 2026
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ కనిపించని స్థాయిలో ఇంధన సంక్షోభం ముప్పు ప్రపంచాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) అధిపతి ఫాతిహ్‌ బిరోల్‌ హెచ్చరించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతంలో 40కి పైగా ఇంధన క్షేత్రాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. దీంతో గ్లోబల్‌గా ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

గత సంక్షోభాల కంటే తీవ్ర పరిస్థితులు

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు 1970లలో ఎదురైన చమురు సంక్షోభం, అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో వచ్చిన గ్యాస్‌ సంక్షోభాన్ని మించిపోయేలా ఉన్నాయని బిరోల్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటివరకు చూడని పెద్ద ముప్పును ఎదుర్కొంటోందని ఆయన స్పష్టం చేశారు. ''పరిస్థితి త్వరగా చక్కబడాలని ఆశిస్తున్నాం. పశ్చిమాసియాలో ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతింటే దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగా పడుతుంది. దీంతో ధరల్లో అనిశ్చితి పెరిగి, సరఫరాలో కొరత తలెత్తే అవకాశం ఉంది'' అని హెచ్చరించారు.

వివరాలు 

ఇప్పటికే ఒత్తిడిలో ఆర్థిక వ్యవస్థలు

ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, మందగిస్తున్న ఆర్థిక వృద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇంధన సంక్షోభం ముప్పు మరింత భారం పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. చరిత్రలో భారీ చమురు సంక్షోభాలు ప్రపంచ చమురు వాణిజ్యంలో 1973 సంవత్సరం అతిపెద్ద సంక్షోభంగా గుర్తింపు పొందింది. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చిన అమెరికా, నెదర్లాండ్స్‌, పోర్చుగల్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాలపై ఒపెక్‌ దేశాలు చమురు ఆంక్షలు విధించాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్ కొరత ఏర్పడి, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు భారీగా పెరిగాయి. తర్వాత 1970లలో ఇస్లామిక్ విప్లవం ప్రభావంతో మళ్లీ చమురు ధరలు ఎగిసిపోయాయి. ఇక 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఐరోపాకు గ్యాస్‌ సరఫరా దెబ్బతింది.

Advertisement

వివరాలు 

ప్రస్తుత పరిస్థితి మరింత క్లిష్టం

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గతంలో జరిగిన ఆయిల్‌, గ్యాస్‌ సంక్షోభాలన్నింటి ప్రభావాలను కలిపినట్లుగా ఉన్నాయని బిరోల్‌ అభిప్రాయపడ్డారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతోందని ఆయన హెచ్చరించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రపంచ దేశాలు తక్షణం దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

Advertisement