US and Israel's war with Iran: అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం 10వ రోజు… ఇప్పటివరకు ఏం జరిగింది?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా,ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ప్రారంభించిన యుద్ధం పదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇరాన్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ నియమితులయ్యారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజలు ఆయనకు మద్దతుగా నిలవాలని ఇరాన్ అధికారులు పిలుపునిచ్చారు. తన తండ్రి అలీ ఖమేనీ హత్యకు గురైన తర్వాత మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో ఇరాన్ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
vivaralu
గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లు
ఇక యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లను దాటాయి. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై అంతరాయం కలగవచ్చన్న ఆందోళనలతో ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్లోని ఇంధన నిల్వ కేంద్రాలు, ఆయిల్ వనరులపై దాడులు చేయడంతో యుద్ధం కొత్త దశలోకి వెళ్లిందని ఇరాన్ అధికారులు హెచ్చరించారు. దీనికి ప్రతిగా ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై ప్రతీకార దాడులు చేస్తామని కూడా స్పష్టం చేశారు.
వివరాలు
బహ్రెయిన్లో నివాస ప్రాంతంపై ఇరాన్ డ్రోన్ దాడి.. 32 మందికి గాయాలు
ఈ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ బీరూట్,ఇరాన్లో కొన్ని లక్ష్యాలపై దాడులు చేసినట్లు ప్రకటించగా, ఇరాన్ కూడా క్షిపణి దాడులు ప్రారంభించినట్లు తెలిపింది. గల్ఫ్ దేశాలు కొన్ని దాడులను అడ్డుకున్నట్లు వెల్లడించాయి. బహ్రెయిన్లో నివాస ప్రాంతంపై ఇరాన్ డ్రోన్ దాడి జరగడంతో కనీసం 32 మంది గాయపడ్డారని సమాచారం. అదే సమయంలో బహ్రెయిన్ జాతీయ ఆయిల్ కంపెనీ బాప్కో కార్యకలాపాలపై కూడా ప్రభావం పడినట్లు తెలుస్తోంది.
వివరాలు
ప్రాథమిక పాఠశాలపై బాంబు.. 168 మంది పిల్లలు మృతి
మరోవైపు అమెరికా దాడిలో ఇరాన్లోని ఒక ప్రాథమిక పాఠశాలపై బాంబు పడడంతో కనీసం 168 మంది పిల్లలు మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈఘటనపై విచారణ కొనసాగుతోందని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా భద్రతా పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ సౌదీ అరేబియాలో ఉన్న అత్యవసరం కాని దౌత్య సిబ్బందిని వెనక్కి రావాలని ఆదేశించింది. ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్కు మద్దతుగా సోమవారం దేశవ్యాప్తంగా సభలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం 3గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలు భారీగా చేరి కొత్త సుప్రీం లీడర్కు మద్దత్తు ప్రకటించాలని ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే యుద్ధం తక్షణమే ముగిసే అవకాశాలు కనిపించడం లేదని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.
వివరాలు
యుద్ధం ఎప్పుడు ముగియాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి నిర్ణయిస్తాయి: ట్రంప్
ఇజ్రాయెల్ ఇంధన డిపోలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో యుద్ధం మరింత తీవ్ర దశలోకి వెళ్లిందని పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పెరుగుతున్న చమురు ధరలపై ఆందోళన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ యుద్ధం ఎప్పుడు ముగియాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి నిర్ణయిస్తాయని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ నిర్ణయంలో భాగమవుతారని, అయితే తుది నిర్ణయం వాషింగ్టన్దేనని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఇరాన్ లొంగుబాటు నిబంధనలను కూడా అమెరికానే నిర్ణయిస్తుందని రక్షణ శాఖ తెలిపింది.