
UK: భారతీయులను యూకే నుంచి పంపించనున్నారా? 'డిపోర్ట్ నౌ, అప్పీల్ లేటర్' జాబితాలో భారత్!
ఈ వార్తాకథనం ఏంటి
యునైటెడ్ కింగ్డమ్(యూకే)ప్రభుత్వం తన "డిపోర్ట్ నౌ, అప్పీల్ లేటర్" విధానాన్ని విస్తరించింది. ఈ జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. దీంతో మొత్తం దేశాల సంఖ్య 23కి పెరిగింది. ఈ కొత్త నిబంధన ప్రకారం, విదేశీ నేరస్తులను అప్పీల్ చేసే అవకాశం కల్పించే ముందు దేశం నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత వారు తమ దేశం నుంచి వీడియో లింక్ ద్వారా మాత్రమే అప్పీల్ దాఖలు చేసుకోవాలి. భారత్ సహా 23 దేశాలకు ఈ విధానం వర్తించనుంది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం యూకే జైళ్లలో ఉన్న సుమారు 320 మంది భారతీయ ఖైదీలు ఈ నియమానికి లోబడి పంపించబడే అవకాశం ఉంది.
Details
హోమ్ సెక్రటరీ వ్యాఖ్యలు
ఈ నిర్ణయం వలసల పెరుగుదల, నేరస్తులను దేశం నుంచి పంపడంలో జరిగే ఆలస్యం వంటి సమస్యలను తగ్గించడానికి భాగంగా తీసుకున్నట్లు బ్రిటన్ హోమ్ ఆఫీస్ ఆదివారం ప్రకటించింది. "ఎన్నో సంవత్సరాలుగా విదేశీ నేరస్తులు మా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ను దుర్వినియోగం చేస్తున్నారు. అప్పీల్ ప్రక్రియ పొడవుగా సాగుతూ, వారు నెలల తరబడి లేదా ఏళ్ల తరబడి యూకేలో ఉంటున్నారు. ఇది ఇక కొనసాగదని యూకే హోమ్ సెక్రటరీ యావెట్ కూపర్ హెచ్చరించారు. "మా దేశంలో నేరాలు చేసిన వారు చట్టాలను గౌరవించాలి. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు.
Details
జాబితాలో ఉన్న దేశాలు
ఇప్పటివరకు ఫిన్లాండ్, అల్బేనియా, బెలీజ్, నైజీరియా, ఎస్టోనియా, మారిషస్, టాంజానియా, కోసోవో మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు భారత్తో పాటు అంగోలా, ఆస్ట్రేలియా, కెనడా, గయానా, ఇండోనేషియా, బోట్స్వానా, బ్రూనై, బల్గేరియా, కెన్యా, లాత్వియా, లెబనాన్, మలేషియా, ఉగాండా, జాంబియా దేశాలు కూడా చేరాయి.
Details
ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి
మరిన్ని దేశాలను కూడా ఈ విధానంలో చేర్చే దిశగా యూకే ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. "విదేశీ నేరస్తులను తక్షణమే వారి దేశాలకు పంపి, వారు అప్పీల్ చేయాలనుకుంటే తమ దేశం నుంచే సురక్షితంగా చేసుకునే అవకాశం ఇవ్వాలని మేము కృషి చేస్తున్నామని యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ తెలిపారు. ఈ విధానం బ్రిటన్ పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గిస్తుందని, గతంలో ఈ దేశాల నేరస్తులు శిక్ష పూర్తయిన తర్వాత కూడా యూకేలో ఎక్కువ కాలం ఉన్నారని హోమ్ ఆఫీస్ తెలిపింది.