
Air India crash: బ్రిటన్కు చెందిన బాధితుడి మృతదేహం తప్పుగా అప్పగింత.. బాధ్యులపై చర్యలకు బాధితుని సోదరి డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిటన్కు చెందిన ఫియాంగల్ గ్రీన్లా-మీక్ (39)మృతదేహాన్ని తప్పుగా మరొకరికి అప్పగించడంపై అతని సోదరి ఆర్వెన్ గ్రీన్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈతప్పిదం తమ కుటుంబానికి ఇంకా ఎక్కువ మానసిక ఆందోళనను కలిగించిందని ఆమె చెప్పారు. విమానప్రమాదం స్థలంలో సరైన న్యాయవైద్య చర్యలు లేకపోవడమే ఈ తప్పులకీ కారణమని ఆమె ఆరోపించారు. అలాగే శరీరాలు తప్పుగా గుర్తించడం వల్ల తమ కుటుంబం మరోసారి తీవ్ర మానసిక వేదనను అనుభవించాల్సి వచ్చిందన్నారు. "ఇది ఇప్పటిదాకా వేరే వారికీ జరగడం మేము చూశాము.ఇప్పుడు అదే మాకు జరగడం చాలా షాకింగ్గా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నాం"అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
కూలిన విమానంలో మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయారు
ఈ నేపథ్యంలో బ్రిటన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ, మృతదేహాల అధికారిక గుర్తింపు భారత అధికారుల పరిధిలోకి వస్తుందని తెలిపింది. అయితే, ప్రమాదంలో మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తామని స్పష్టం చేసింది. లండన్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం,అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఒక మెడికల్ కాలేజ్ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో కేవలం ఒకరు తప్ప, మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయారు.అందులో 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు.
వివరాలు
మరో 12 నెలల్లో తుది నివేదిక
ఈ ఘటనపై వచ్చిన ప్రాథమిక నివేదికలో, టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమాన ఇంధన స్విచ్లు 'కట్-ఆఫ్' స్థితికి మారిందని, ఇది సాంకేతిక లోపమా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిన సబోటాజ్ అయ్యుండవచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విమాన ప్రమాదంపై తుది నివేదిక మరో 12 నెలల్లో విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాతే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టత రానుంది.