Page Loader
Trump- Zelensky: ట్రంప్‌తో ముఖ్యమైన, సానుకూల చర్చలు జరిగాయి.. ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదు: జెలెన్‌స్కీ 
ట్రంప్‌తో ముఖ్యమైన, సానుకూల చర్చలు జరిగాయి.. ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదు: జెలెన్‌స్కీ

Trump- Zelensky: ట్రంప్‌తో ముఖ్యమైన, సానుకూల చర్చలు జరిగాయి.. ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదు: జెలెన్‌స్కీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy)తో ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే, ఈ కాల్ సందర్భంగా ట్రంప్ తనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని జెలెన్‌స్కీ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

వివరాలు 

రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందం 

రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య శాంతి ఒప్పందం కోసం అవసరమైన అంశాల జాబితాను కీవ్ ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఇందులో ఇంధన మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా రైలు, ఓడరేవు సదుపాయాలు కూడా ఉండవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా, రష్యాతో కాల్పుల విరమణకు సంబంధించి అధికారిక పత్రం వచ్చేంత వరకు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రష్యా ఆక్రమణలో ఉన్న జపోరిజ్జియా అణుశక్తి ప్లాంట్ గురించి కూడా చర్చించినట్లు చెప్పారు. ఈ ప్లాంట్ తిరిగి తమకు అప్పగిస్తే, దాని ఆధునీకరణలో అమెరికా పెట్టుబడుల గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ వెల్లడించారు.

వివరాలు 

ట్రంప్-జెలెన్‌స్కీ ఫోన్ సంభాషణ 

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల ట్రంప్‌తో శ్వేతసౌధంలో జెలెన్‌స్కీ భేటీ అయ్యారు.ఆ సమావేశంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో, కీవ్‌లోని ఖనిజాలకు సంబంధించిన ఒప్పందం కుదరకుండా, జెలెన్‌స్కీ అమెరికా నుండి తిరిగి వెనుదిరిగారు. అయితే, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. ఇక ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో ట్రంప్ ఇటీవల ఫోన్ ద్వారా మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులను నెల రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.

వివరాలు 

జెలెన్‌స్కీతో ట్రంప్ తాజా చర్చలు 

అయితే, ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే దాన్ని ఉల్లంఘించినట్లు తెలిసింది. ఈ కాల్పుల మద్య, రెండు దేశాలు 175 మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్చుకున్నాయి. బుధవారం జరిగిన ఫోన్ సంభాషణలో, దాదాపు గంటపాటు ట్రంప్-జెలెన్‌స్కీ పుతిన్‌తో జరిగిన చర్చల గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారని ట్రంప్ వెల్లడించారు. ఈ చర్చలకు సంబంధించి మరింత వివరాలు రూపొందించాల్సిందిగా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్‌లకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.