Ola S1 X+: సింగిల్ ఛార్జ్తో 320 కి.మీ.. ఓలా నుంచి కొత్త S1 X+ స్కూటర్ లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్ను విడుదల చేసింది. సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీతో రూపొందించిన Ola S1 X+ 5.2 kWh వేరియంట్ను సోమవారం లాంచ్ చేసింది. ఈ మోడల్ ధరను రూ.1,29,999గా నిర్ణయించింది. ఇన్హౌస్ సెల్ టెక్నాలజీ కారణంగా ఈ స్కూటర్ను అందుబాటు ధరలో తీసుకురావడం సాధ్యమైందని సంస్థ వెల్లడించింది.
వివరాలు
గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు
ప్రారంభ ఆఫర్గా ఏప్రిల్ 15 వరకు ఈ స్కూటర్ను రూ.1.29 లక్షల ప్రారంభ ధరకు అందుబాటులో ఉంచనున్నట్లు ఓలా తెలిపింది. ఇందులో 11kW మిడ్ డ్రైవ్ మోటార్ అమర్చారు. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు (IDC రేంజ్) ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. అదనంగా మెరుగైన భద్రత కోసం బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఎస్1 ప్రో స్కూటర్లు, రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైకులను మార్కెట్లో విక్రయిస్తోంది.
వివరాలు
ఎన్నో ప్రీమియం మోడళ్లు
ఎస్1 థర్డ్ జనరేషన్లో ఎస్1 ప్రో+ (5.2kWh, 4kWh), ఎస్1 ప్రో (4kWh, 3kWh) వంటి ప్రీమియం మోడళ్లను అందిస్తోంది. మాస్ మార్కెట్ కోసం ఎస్1 ఎక్స్+ (4kWh), ఎస్1 ఎక్స్ (2, 3, 4kWh) వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా రోడ్స్టర్ ఎక్స్+ మోడల్ను 4.5kWh, 9.1kWh బ్యాటరీ ఎంపికలతో, రోడ్స్టర్ ఎక్స్ను 2.5, 3.5, 4.5kWh సామర్థ్యాలతో విక్రయిస్తోంది. ఈ శ్రేణిలో తాజా చేరికగా ఎస్1 ఎక్స్+ 5.2kWh వేరియంట్ను ఓలా పరిచయం చేసింది.