Tata Motors: టాటా నుంచి మరో విప్లవం.. త్వరలో భారత మార్కెట్లోకి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు
ఈ వార్తాకథనం ఏంటి
టాటా మోటార్స్ భారతదేశంలో క్లీన్ ఎనర్జీ వాహనాల విభాగంలో మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్, సీఎన్జీ, హైడ్రోజన్ వాహనాల తర్వాత ఇప్పుడు దేశీయ మార్కెట్లో తమ తొలి 'ఫ్లెక్స్-ఫ్యూయల్' కారును ప్రవేశపెట్టేందుకు కంపెనీ భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కొత్త మోడల్ను 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో లాంచ్ చేయాలని టాటా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచుతూ భవిష్యత్తులో పూర్తిస్థాయి 'ఈ100' (100 శాతం ఇథనాల్) వినియోగాన్ని ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.
వివరాలు
ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి
ఈ విషయాన్ని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శైలేష్ చంద్ర అధికారికంగా వెల్లడించారు. వేర్వేరు శాతాల్లో ఇథనాల్ మిశ్రమంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ప్రత్యేక కేటగిరీని నిబంధనల్లో తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు. అధిక శాతం ఇథనాల్ బ్లెండింగ్ అమలుపై భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ద్వారా ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. టాటా మోటార్స్ ఇప్పటికే 2023 నుంచే తమ పెట్రోల్ వాహనాలన్నింటినీ ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) ఇంధనానికి అనుగుణంగా మార్చింది. పర్యావరణహిత ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే క్రమంలో కంపెనీ ఎలక్ట్రిక్, సీఎన్జీ, హైడ్రోజన్ టెక్నాలజీలతో పాటు ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టింది.
వివరాలు
ఎగ్జాస్ట్ ట్రీట్మెంట్ సిస్టమ్లలో కీలక మార్పులు
ఈ నేపథ్యంలోనే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో టాటా మోటార్స్ తమ ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని ప్రదర్శించింది. ముఖ్యంగా ఆటో ఎక్స్పో 2025లో కంపెనీ 'టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్' కాన్సెప్ట్ మోడల్ను ఆవిష్కరించి ఆకట్టుకుంది. టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్లో సాధారణ పంచ్ కారులో ఉపయోగించే 1.2 లీటర్ త్రీ-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్నే ఉపయోగించారు. అయితే వేర్వేరు మోతాదుల్లో ఉండే ఇథనాల్ మిశ్రమాలను తట్టుకునేలా ఈసీయూ, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఎగ్జాస్ట్ ట్రీట్మెంట్ సిస్టమ్లలో కీలక మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో టాటా పంచ్ ఒకటి. ఇప్పటికే ఈ మోడల్ పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
వివరాలు
సాధారణ పెట్రోల్ తో పోలిస్తే తక్కువ కాలుష్యం
ఇప్పుడు ఫ్లెక్స్-ఫ్యూయల్ వేరియంట్ కూడా అందుబాటులోకి వస్తే, ఒకే మోడల్లో విభిన్న ఇంధన ఎంపికలను అందించాలన్న టాటా వ్యూహం మరింత బలపడనుంది. ఇక ఫ్లెక్స్-ఫ్యూయల్ వెహికల్ (ఎఫ్ఎఫ్వీ) అంటే ఏమిటంటే.. ఈ తరహా వాహనాలను కేవలం పెట్రోల్తోనే కాకుండా, కేవలం ఇథనాల్తో లేదా ఈ రెండింటి మిశ్రమంతోనూ నడిచేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న, జొన్నలు వంటి పంటల నుంచి తయారయ్యే పర్యావరణహిత జీవ ఇంధనం. ఇది సాధారణ పెట్రోల్తో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. అయితే ఇథనాల్కు తుప్పు పట్టించే లక్షణం ఎక్కువగా ఉండటంతో, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల్లో ఇంజన్, ఫ్యూయల్ పంప్, ఇంజెక్టర్లను ప్రత్యేక మెటీరియల్స్తో తయారు చేస్తారు.
వివరాలు
వేగంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ అభివృద్ధి
ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న ఆధునిక కార్లు ఈ20 ఇంధనానికి మాత్రమే మద్దతు ఇస్తుండగా, ప్రభుత్వం ఇప్పుడు ఈ85, ఈ100 వంటి అధిక ఇథనాల్ మిశ్రమాల వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి.