Automobile Market: పండుగ సీజన్లో దూసుకెళ్లిన ఆటో మార్కెట్.. గత నెలలో 5.2 లక్షల కార్ల విక్రయాలు
ఈ వార్తాకథనం ఏంటి
జీఎస్టీ రేట్ల తగ్గింపు పండుగ సీజన్లో భారత ఆటో మొబైల్ మార్కెట్కు కొత్త ఊపు తీసుకువచ్చింది. అక్టోబర్లో ఆటో కంపెనీలు అంచనాలను మించి రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా మొత్తం 5.2 లక్షలకు పైగా కార్లు విక్రయించబడ్డాయి. అందులో మారుతి సుజుకి 2,42,096 వాహనాలను విక్రయించి, గత ఏడాదితో పోలిస్తే 20 శాతం వృద్ధి సాధించింది. నవరాత్రి ప్రారంభం నుంచి కొనసాగిన 40 రోజుల పండుగ సీజన్లో 5 లక్షలకుపైగా బుకింగ్లు నమోదవగా, అందులో 4.1 లక్షల వాహనాలు కస్టమర్లకు డెలివరీ చేశారు. మహీంద్రా & మహీంద్రా కూడా SUV విభాగంలో తన చరిత్రలోనే అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. ఈ సంస్థ 71,624 యూనిట్ల SUVలను విక్రయించింది,
Details
గతేడాదిలో పోలిస్తే 31శాతం అధికం
ఇది గత ఏడాదితో పోలిస్తే 31 శాతం అధికం. టాటా మోటార్స్ 61,295 వాహనాల అమ్మకాలతో మరో రికార్డును నెలకొల్పింది. వీటిలో 47,000కు పైగా SUVలు ఉండగా, మొత్తం అమ్మకాలలో 77 శాతం వాటా SUVలదే. కియా ఇండియా కూడా తన అమ్మకాలలో గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. సంస్థ అక్టోబర్లో 29,556 యూనిట్లను విక్రయించి 30 శాతం పెరుగుదల సాధించింది. టయోటా మోటార్ అమ్మకాలు కూడా 39 శాతం పెరిగి 42,892 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు స్వల్పంగా తగ్గి 53,792 యూనిట్లకు పరిమితమయ్యాయి. పండుగ సీజన్ డిమాండ్, జీఎస్టీ రేట్ల తగ్గింపు, కొత్త మోడళ్ల ఆవిష్కరణ వంటి అంశాలు ఆటోమొబైల్ రంగంలో ఉత్సాహాన్ని నింపాయి.