LOADING...
Battery Recycling Scheme: రూ.1,500 కోట్ల బ్యాటరీ రీసైక్లింగ్ పథకాన్ని ప్రకటించిన కేంద్రం
రూ.1,500 కోట్ల బ్యాటరీ రీసైక్లింగ్ పథకాన్ని ప్రకటించిన కేంద్రం

Battery Recycling Scheme: రూ.1,500 కోట్ల బ్యాటరీ రీసైక్లింగ్ పథకాన్ని ప్రకటించిన కేంద్రం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 18, 2026
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు బ్యాటరీ తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్ల విలువైన క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ను ప్రకటించింది. 2026 బ్యాటరీ సమ్మిట్ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రకటించింది.

వివరాలు

బ్యాటరీల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడంపై దృష్టి..

ఈ పథకం ప్రధానంగా వినియోగం పూర్తయిన లిథియం-అయాన్ బ్యాటరీల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. బ్యాటరీలను శాస్త్రీయ పద్ధతిలో విడదీసే ప్రక్రియకు ప్రోత్సాహం అందించడంతో పాటు, వాటి నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి కీలక ఖనిజాలను తిరిగి వెలికితీయడం దీని లక్ష్యం. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో అత్యంత కీలకమైనవి. ప్రస్తుతం వీటిలో ఎక్కువ భాగాన్ని భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

వివరాలు

లిథియం, అయాన్ బ్యాటరీలకు పెరుగుతున్న డిమాండ్..

దేశంలో లిథియం-అయాన్ బ్యాటరీల డిమాండ్ వేగంగా పెరుగుతున్న సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమ అంచనాల ప్రకారం, 2022లో ఏడాదికి 20 గిగావాట్ గంటలు (GWh)గా ఉన్న డిమాండ్ 2030 నాటికి 220 గిగావాట్ గంటలకు చేరుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం, ఇంధన నిల్వ అవసరాలు అధికం కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాటరీల దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1.2 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీల దిగుమతులు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి 4.7 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగాయి.

Advertisement

వివరాలు

ముడి పదార్థాల ప్రాసెసింగ్‌కు ఏర్పాట్లు..

దేశీయ బ్యాటరీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రస్తావించారు. రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా కీలక ముడి ఖనిజాల లభ్యతను మెరుగుపరచడంతో పాటు సరఫరా వ్యవస్థలో ఎదురయ్యే సమస్యలను తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఈ పథకం అమలుతో దేశీయ తయారీ సంస్థలు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకుని, దీర్ఘకాలంలో ఉత్పత్తి వ్యయాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బ్యాటరీ రీసైక్లింగ్ పథకంతో పాటు ముడి పదార్థాల ప్రాసెసింగ్‌కు సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధిపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

Advertisement

వివరాలు

నాలుగు క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ పార్కులు..

ఇందులో భాగంగా నాలుగు క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ పార్కులు, తొమ్మిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రణాళికను అమలు చేస్తోంది. దీని ద్వారా దేశంలో సాంకేతిక సామర్థ్యాలను పెంచడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముడి ఖనిజాల లభ్యతను దీర్ఘకాలికంగా భద్రపరచుకునేందుకు దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా కేంద్రం చర్యలను వేగవంతం చేసింది. 2015 నుంచి ఇప్పటివరకు 570కి పైగా ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులు చేపట్టగా, దేశవ్యాప్తంగా 46 కీలక ఖనిజ బ్లాక్‌లను వేలం వేసింది. అలాగే అర్జెంటీనాతో సహా విదేశాల్లో లిథియం వనరులను సొంతం చేసుకునేందుకు కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. భవిష్యత్తులో ముడి పదార్థాల సరఫరాను స్థిరంగా కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

Advertisement