LOADING...
Chinese EV: భారత EV మార్కెట్‌లో చైనా కంపెనీల దూకుడు 
భారత EV మార్కెట్‌లో చైనా కంపెనీల దూకుడు

Chinese EV: భారత EV మార్కెట్‌లో చైనా కంపెనీల దూకుడు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల(EV)మార్కెట్‌లో చైనా కంపెనీలు గట్టిగా పట్టు సాధిస్తున్నాయి. ఇప్పటివరకు టాటా మోటార్స్‌, మహీంద్రా & మహీంద్రా ఆధిపత్యం ఉన్న ఈ రంగంలో, గత రెండేళ్లలోనే BYD,MG (చైనా SAIC మోటార్‌ యాజమాన్యంలోని బ్రాండ్), అలాగే చైనా గీలీకి చెందిన వోల్వో వంటి కంపెనీలు దక్షిణ కొరియా,జర్మనీ కంపెనీలను వెనక్కు నెట్టి దాదాపు మూడో వంతు మార్కెట్‌ను దక్కించుకున్నాయి. జాటో డైనమిక్స్‌ గణాంకాల ప్రకారంఈ ఏడాది అక్టోబర్‌ వరకు చైనా బ్రాండ్లు 57,260EVలను విక్రయించి మొత్తం మార్కెట్‌లో 33%వాటాను సంపాదించాయి. నిపుణుల మాటల్లో, చైనా కంపెనీలు రాకతో వినియోగదారులకు ఎంపికలు పెరగడమే కాకుండా, ఆధునిక బ్యాటరీ టెక్నాలజీ,ప్రీమియం ఫీచర్లు,త్వరితగతిన కొత్త మోడళ్లను ప్రవేశపెట్టే ట్రెండ్‌ మరింత వేగం పట్టింది.

వివరాలు 

 MG మోటార్‌ ఇప్పుడు స్పష్టమైన వృద్ధి దిశలో.. 

ఫీచర్లతో నిండిన మాస్-మార్కెట్‌ EVలను తొలుత భారత మార్కెట్లోకి తీసుకువచ్చిన MG మోటార్‌ ఇప్పుడు స్పష్టమైన వృద్ధి దిశలో ఉందని JSW MG Motor India చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ వినయ్ రైనా తెలిపారు. 2019లో భారత్‌లో ఒక్క చైనా ఎలక్ట్రిక్‌ కారు కూడా అమ్ముడుకాలేదు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు ఇంత పెద్ద వృద్ధి రావడం చాలా ప్రత్యేకం. అగ్ర EV తయారీదారుల్లో ఒకటైన BYD, భారత్‌లో అడుగు పెట్టిన తర్వాత వేగంగా అమ్మకాలు పెంచుకుంటోంది. కమర్షియల్‌-ఫ్లీట్‌ మార్కెట్లో ఈ బ్రాండ్‌కి డిమాండ్‌ బాగా పెరిగింది. ఇదిలా ఉంటే, ప్రీమియం మార్కెట్లో వోల్వో కూడా స్వంత స్థానం ఏర్పరుచుకుంది.

వివరాలు 

స్థానికీకరణ వ్యూహమే వేగంగా పెరుగుతున్న మార్కెట్లో పోటీగా నిలిచేందుకు కీలకం

"భారత మార్కెట్లో మా వృద్ధికి విశ్వసనీయ కస్టమర్‌ బేస్‌, ఎలక్ట్రిఫికేషన్‌పై మేము వేగంగా దృష్టి పెట్టడం ప్రధాన కారణాలు" అని వోల్వో కార్‌ ఇండియా MD జ్యోతి మల్హోత్రా తెలిపారు. బలమైన దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు కలిసి ఉండటంతో భారత ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ మరింత అభివృద్ధి చెందినదిగా మారింది. వోల్వో తరచూ కస్టమర్‌ క్లినిక్స్‌ నిర్వహిస్తూ ఫీచర్లు, ధరలు, వినియోగదారుల అంచనాలను అర్థం చేసుకుంటోంది. "ఇప్పుడేమో భారతదేశంలో అమ్ముతున్న అన్ని మోడళ్లను లోకల్‌గా అసెంబుల్‌ చేస్తున్నాము" అని మల్హోత్రా చెప్పారు. ఈ స్థానికీకరణ వ్యూహమే వేగంగా పెరుగుతున్న మార్కెట్లో పోటీగా నిలిచేందుకు కీలకం అవుతోంది.