Ford: నాణ్యత కోసం యూటర్న్.. పాత ఇంజనీర్లను రీహైర్ చేస్తున్న ఫోర్డ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత ఆటో మొబైల్ సంస్థ ఫోర్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై అతిగా ఆధారపడటం వల్ల ఎదురైన సవాళ్ల నుంచి కీలక పాఠం నేర్చుకుంది. ఆటోమేటెడ్ క్వాలిటీ సిస్టమ్స్ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో కంపెనీ తన వ్యూహంలో మార్పులు చేపట్టింది. ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు ఖర్చులను నియంత్రించే లక్ష్యంతో అనుభవజ్ఞులైన ఇంజనీర్లను, ముఖ్యంగా మాజీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి ఆహ్వానిస్తోంది. మానవ నైపుణ్యానికి మళ్లీ పెద్దపీట వేయడం వల్ల ఇప్పటికే సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని కంపెనీ పేర్కొంటోంది. జేడీ పవర్ ఇనిషియల్ క్వాలిటీ సర్వేలో ప్రముఖ బ్రాండ్లలో ఫోర్డ్ అగ్రస్థానానికి చేరడం దీనికి నిదర్శనంగా చెబుతోంది.
వివరాలు
మూడేళ్లలో 350 మంది నిపుణుల పునర్నియామకం
'బ్లూమ్బర్గ్' కథనం ప్రకారం, గత మూడు సంవత్సరాల్లో ఫోర్డ్ సుమారు 350 మంది అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తిరిగి నియమించుకుంది. వీరిలో సంస్థ మాజీ ఉద్యోగులతో పాటు, అనుబంధ సంస్థల్లో పనిచేసిన నిపుణులు కూడా ఉన్నారు. దశాబ్దాల అనుభవం కలిగిన ఉద్యోగుల విజ్ఞానాన్ని పక్కనపెట్టి పూర్తిగా ఆటోమేషన్పై ఆధారపడటం సరైన నిర్ణయం కాదని కంపెనీ ఉన్నతాధికారులు అంగీకరించారు.
వివరాలు
ఏఐ ఒక్కటే పరిష్కారం కాదన్న ఫోర్డ్
ఫోర్డ్ వెహికల్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ పూన్ మాట్లాడుతూ, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రవేశపెడితే అత్యుత్తమ నాణ్యత సాధ్యమవుతుందని భావించడం పొరపాటేనని చెప్పారు. ఏఐ శక్తివంతమైన సాధనమే అయినప్పటికీ, దానికి అందించే సమాచార నాణ్యతపై దాని పనితీరు ఆధారపడి ఉంటుందని వివరించారు. అలాగే, అనుభవజ్ఞులైన ఇంజనీర్లు సంస్థను వీడే సమయంలో వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని భద్రపరచడంలో విఫలమయ్యామని ఆయన అంగీకరించారు. దీంతో ఏఐ వ్యవస్థలు వాస్తవ పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించలేకపోయాయని తెలిపారు.
వివరాలు
"గ్రే బియర్డ్స్"గా కీలక బాధ్యతలు
తిరిగి విధుల్లో చేరిన ఈ సీనియర్ నిపుణులను ఫోర్డ్ సంస్థలో "గ్రే బియర్డ్స్"గా పిలుస్తున్నారు. వీరు యువ ఇంజనీర్లకు మార్గనిర్దేశం చేయడంతో పాటు, ఏఐ టూల్స్కు మెరుగైన శిక్షణ అందించడం, వాహనాలు ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లే ముందే నాణ్యతా లోపాలను గుర్తించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫోర్డ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కుమార్ గల్హోత్రా మాట్లాడుతూ, సమస్య తలెత్తిన తర్వాత పరిష్కరించే విధానం నుంచి, సమస్యలు రాకముందే నివారించే విధానానికి కంపెనీ మారుతోందని తెలిపారు. ఈ మార్పులో అనుభవజ్ఞులైన ఇంజనీర్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
వివరాలు
అన్ని విభాగాల మధ్య సమన్వయం
ఫోర్డ్ చేపట్టిన మార్పులు కేవలం వాహన హార్డ్వేర్కే పరిమితం కాలేదు. సాఫ్ట్వేర్, తయారీ (మాన్యుఫ్యాక్చరింగ్), సప్లై-చెయిన్ విభాగాల మధ్య సమన్వయాన్ని కూడా కంపెనీ మరింత బలోపేతం చేసింది. కస్టమర్లకు వాహనాలు చేరేలోపే సాఫ్ట్వేర్ విశ్వసనీయతను మెరుగుపరచేందుకు 40 మంది సభ్యులతో ప్రత్యేక క్వాలిటీ అస్యూరెన్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది.
వివరాలు
ఏఐని వదలడం కాదు.. మరింత సమర్థంగా వినియోగం
అయితే ఫోర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పూర్తిగా పక్కన పెట్టడం లేదు. అనుభవజ్ఞులైన ఇంజనీర్ల నుంచి సేకరించిన విలువైన సమాచారంతో ఏఐ సామర్థ్యాన్ని మరింత పెంచుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో వాహన సాఫ్ట్వేర్ పనితీరును పరీక్షించేందుకు 1 లక్షకు పైగా కొత్త ఏఐ ఆధారిత వాలిడేషన్ టెస్టులను జోడించినట్లు కంపెనీ వెల్లడించింది. మానవ అనుభవాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని సమన్వయం చేస్తూ మరింత నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని ఫోర్డ్ స్పష్టం చేసింది.