Hero Bikes: హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్లపై రూ.4,000 తగ్గింపు..జూలై 2026 వరకు ఆఫర్.. కొత్త ధరలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ కమ్యూటర్ బైక్లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన హీరో స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్,హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లపై రూ.4,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ జూలై 2026 వరకు అందుబాటులో ఉండనుండటంతో వినియోగదారులకు ఈ బైక్లు మరింత తక్కువ ధరలో లభించనున్నాయి. తాజా డిస్కౌంట్తో హీరో స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.82,710 నుంచి రూ.78,710కు తగ్గింది. అలాగే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర రూ.72,792 నుంచి రూ.68,792కు చేరింది. కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని అనుభవించాలని భావిస్తున్న కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈ ఆఫర్ ఉపయోగపడనుంది.
వివరాలు
ఈ బైక్ల ప్రత్యేకత ఏమిటంటే..
ఇక ధరల పరంగా చూస్తే, స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ సాధారణ E20 స్ప్లెండర్+ కంటే కేవలం రూ.1,153 మాత్రమే అధిక ధరలో ఉంది. మరోవైపు హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హెచ్ఎఫ్ డీలక్స్ i3S క్యాస్ట్ వేరియంట్ కంటే సుమారు రూ.1,650 తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి E85 ఇంధనంతో నడుస్తాయి. E85లో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమం ఉంటుంది. అధిక ఇథనాల్ మిశ్రమంతో పనిచేసే సామర్థ్యం కలిగిన తొలి మాస్ మార్కెట్ కమ్యూటర్ బైక్లలో ఇవి ఒకటిగా నిలిచాయి. E85 ఇంధనానికి అనుగుణంగా హీరో మోటోకార్ప్ ఈ బైక్లలో పలు మార్పులు చేసింది.
వివరాలు
8.3 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి
కొత్త ఫ్యూయల్ పంప్, అదనపు ఫ్యూయల్ ఫిల్టర్, అలాగే ఇంధనంలో ఉన్న ఇథనాల్ శాతాన్ని బట్టి ఫ్యూయల్ సరఫరాను స్వయంచాలకంగా నియంత్రించే రీ-కాలిబ్రేటెడ్ ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU)ను అమర్చింది. హీరో స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్లలో 97.2 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ను అందించారు. E85 ఇంధనంపై ఈ ఇంజిన్ 8.4 బీహెచ్పీ పవర్, 8.3 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే E85 వినియోగంతో 7 శాతం అధిక పవర్, 3 శాతం ఎక్కువ టార్క్ లభిస్తుందని హీరో మోటోకార్ప్ తెలిపింది. దీంతో పర్యావరణ హిత ఇంధనంతో పాటు మెరుగైన పనితీరును కూడా ఈ బైక్లు అందిస్తాయి.
వివరాలు
జూలై 2026 నుంచి బైక్ల విక్రయాలు
హీరో స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ల విక్రయాలు జూలై 2026 నుంచి ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభం కానున్నాయి. అనంతరం దేశంలోని మరిన్ని నగరాలు, రాష్ట్రాలకు వీటిని దశలవారీగా విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.