Maruti Suzuki:ఆటో రంగంలో చరిత్ర సృష్టించిన మారుతీ సుజుకీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఆటో మొబైల్ రంగంలో మారుతీ సుజుకీ (ఎంఎస్ఐ) అరుదైన మైలురాయి సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో సంస్థ 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. దేశంలో ఒకే ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో కార్లను తయారు చేసిన తొలి కంపెనీగా నిలిచిందని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుజుకి మోటార్ కార్పొరేషన్కు చెందిన యూనిట్లలో ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఎంఎస్ఐకే ఉందని సంస్థ ఎండీ, సీఈఓ హిసాషి టేకుచి తెలిపారు. నాలుగున్నర దశాబ్దాలుగా అభివృద్ధి చేసిన వ్యవస్థలు, ఉద్యోగులు, డీలర్లు, సరఫరాదారుల సమిష్టి కృషితో ఈ ఘనత సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
17 మోడళ్లు.. 650 వేరియంట్లు
ప్రభుత్వ విధానాలు, జీఎస్టీ 2.0 సంస్కరణలు కూడా ఈ విజయానికి తోడ్పడ్డాయని చెప్పారు. భవిష్యత్తులో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షలకు పెంచడమే కాకుండా, భారత్ను ఎగుమతుల ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలోమారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి బాలెనో మోడళ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసినట్లు సంస్థ తెలిపింది. ఒక్కో మోడల్ను 2 లక్షలకుపైగా యూనిట్లుగా తయారు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం మారుతీ దేశీయంగా 17 మోడళ్లను మొత్తం 650 వేరియంట్లలో ఉత్పత్తి చేస్తోంది.
వివరాలు
ప్లాంట్లు.. విస్తరణ ప్రణాళిక
కంపెనీకి హరియాణాలోని గురుగ్రామ్, మానేసర్, ఖర్కోడా ప్రాంతాల్లో, గుజరాత్లోని హన్సల్పూర్లో కలిపి నాలుగు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వీటి మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 24 లక్షల వాహనాలు. అదనంగా, మరో 10 లక్షల వాహనాల సామర్థ్యంతో గుజరాత్లోని ఖోరజ్లో కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.