Maruti Suzuki: మారుతి సుజుకీ కార్ల ధరలు పెంపు
ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకీకి చెందిన కార్లు ఇప్పుడు మరింత ప్రియం కాబోతున్నాయి. మారుతి సుజుకీ ఇండియా తన వాహనాల ధరలను పెంచింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. మంగళవారం స్టాక్ మార్కెట్కు ఇచ్చిన సమాచారంలో ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది. అన్ని కార్లపై సగటున 0.45శాతం ధరలను పెంచినట్లు కంపెనీ పేర్కొంది. దిల్లీలోని మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలపై 0.45 శాతం పెంపు జరిగింది. మారుతి సుజుకి ఇండియా(MSI) ఆల్టో నుంచి ఇన్విక్టో వరకు అనేక ప్రసిద్ధ కార్లను విక్రయిస్తోంది. వాటి ధర రూ. 3.54 లక్షల నుంచి రూ. 28.42 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. మారుతి సుజుకీ ఇండియా చివరిసారిగా ధరల పెంపును మొదట నవంబర్లో ప్రకటించింది.
ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో మారుతి సుజుకి టాప్
మారుతి సుజుకి ఇండియా ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో ముందుంది. ఈ కాలంలో ఇది 2,02,786 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇది గత సంవత్సరం కంటే 6శాతం ఎక్కువనే చెప్పాలి. హ్యుందాయ్ మోటార్ ఇండియా 1,29,755 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది ఇదే కాలంలో 1,19,099 యూనిట్లను ఎగుమతి చేసింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్య, కియా ఇండియా 47,792 యూనిట్లను, ఫోక్స్వ్యాగన్ 33,872 యూనిట్లను, నిస్సాన్ 31,678 యూనిట్లను, హోండా కార్స్ 20,262 యూనిట్లను ఎగుమతి చేసింది. కొత్త వాహనాల లాంచ్లకు దక్షిణాఫ్రికా, గల్ఫ్ ప్రాంతం వంటి మార్కెట్లలో డిమాండ్ పెరగడం వల్ల ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు వృద్ధి చెందాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు.