Maruti Suzuki: మారుతి నుంచి మరో గ్రీన్ మొబిలిటీ అడుగు.. దేశంలో తొలి E100 కారు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో తొలి E100-కంపాటిబుల్ ప్యాసింజర్ కార్ను మారుతి సుజుకి మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్' పేరుతో విడుదల చేసిన ఈ కొత్త మోడల్, భారత్లో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG), హైడ్రోజన్ వంటి పలు సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా కాలుష్య ఉద్గారాలను తగ్గించాలన్న కంపెనీ ప్రణాళికలో భాగంగానే ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మారుతి సుజుకి తెలిపింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం, వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో ఈ వాహనాన్ని ఆవిష్కరించారు.
వివరాలు
ఇంధన రంగ ప్రయాణంలో కొత్త అధ్యాయం..
ఈ సందర్భంగా మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేఉచి మాట్లాడుతూ.. వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రారంభం భారత్ ఇంధన రంగ ప్రయాణంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ముందున్న రెండు ప్రధాన సవాళ్లు దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారాన్ని తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడమని ఆయన చెప్పారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఈ రెండు లక్ష్యాలను ఒకేసారి సాధించడంలో సహాయపడుతుందని టకేఉచి తెలిపారు. ఇది నిజమైన అర్థంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉండటంతో పాటు పర్యావరణహిత పరిష్కారమని అన్నారు. దిగుమతి ముడి చమురుపై దీర్ఘకాలికంగా ఆధారపడటం భారత్కు స్థిరమైన మార్గం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రయోజనం..
ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ వల్ల రైతులు, ఎథనాల్ తయారీదారులు, గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని టకేఉచి తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పరిశుభ్రమైన రవాణా వ్యవస్థతో అనుసంధానించే అవకాశాన్ని ఈ టెక్నాలజీ కల్పిస్తుందని చెప్పారు. అయితే ఈ సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి రావాలంటే ఇంధన సరఫరా నుంచి కొత్త మోడళ్ల విడుదల వరకు పూర్తి స్థాయి వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్లో అగ్రగామి సంస్థగా 'ఇండియా గో ఫ్లెక్స్' లక్ష్యాన్ని సాధించడంలో తమ బాధ్యతను నిర్వర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
గ్రీన్ వెహికల్స్ అమ్మకాలలో 50 శాతం వాటా..
ఇక నెట్-జీరో ఉద్గారాల లక్ష్య సాధనలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) కీలక పాత్ర పోషిస్తుందని టకేఉచి తెలిపారు. ఇప్పటివరకు కంపెనీ తొమ్మిది CBG ప్లాంట్లను ప్రకటించగా, వాటిలో రెండు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని వెల్లడించారు. అలాగే హైడ్రోజన్ రంగంలో కూడా పరిశోధన ప్రాజెక్టులను కొనసాగిస్తున్నామని, స్థిరమైన మొబిలిటీ పరిష్కారాల అభివృద్ధికి తమ కట్టుబాటును మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన గ్రీన్ వెహికల్స్ అమ్మకాలలో దాదాపు 50 శాతం వాటాను మారుతి సుజుకి సాధించిందని వెల్లడించారు. పర్యావరణహిత వాహనాల ప్రోత్సాహంలో కంపెనీ బలమైన స్థానాన్ని ఇది ప్రతిబింబిస్తోందని, పరిశుభ్రమైన రవాణా పరిష్కారాల వైపు భారత్ మార్పులో మారుతి సుజుకి కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.