Maruti Suzuki WagonR: ఢిల్లీలో మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల డెలివరీలు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కారైన మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ డెలివరీలను మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ప్రారంభించింది. ఈ కార్ల తొలి బ్యాచ్ను ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) న్యూఢిల్లీలో స్వీకరించింది. జాతీయ రాజధానిలోని ఓ కార్పొరేట్ డీలర్షిప్ ద్వారా ఈ డెలివరీ కార్యక్రమం నిర్వహించారు. వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ సాధారణ వాగన్ ఆర్ ప్లాట్ఫామ్పైనే రూపొందించబడింది. అయితే ఇది E20 నుంచి E100 వరకు వివిధ ఎథనాల్-పెట్రోల్ మిశ్రమాలపై నడిచేలా ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.
వివరాలు
ధర ఎంతంటే?
ప్రస్తుతం దేశంలో ఉన్న బయోఫ్యూయల్ మౌలిక సదుపాయాలు ఇలాంటి వాహనాలకు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయో పరీక్షించడమే కాకుండా, బహుళ ఇంధన మిశ్రమాలతో పనిచేసే ఇంజిన్ల వాణిజ్య వినియోగ సామర్థ్యాన్ని ప్రదర్శించడమే దీని లక్ష్యం. టాప్ ఎండ్ ZXi+ వేరియంట్ ఆధారంగా రూపొందించిన మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర రూ.7.24 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ను అందించారు. ఈ ఇంజిన్ 90 బీహెచ్పీ శక్తి, 113.7 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ను జత చేశారు. ప్రస్తుతం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక అందుబాటులో లేదు. సాధారణ పెట్రోల్ ZXi+ వేరియంట్తో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ధర రూ.85,000 ఎక్కువగా ఉంది.
వివరాలు
నితిన్ గడ్కరీ ప్రోత్సాహంతో ముందుకు..
మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ విడుదల, డెలివరీల ప్రారంభం కేంద్ర ప్రభుత్వం , కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రోత్సహిస్తున్న పరిశుభ్రమైన ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగ లక్ష్యానికి అనుగుణంగా జరిగింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆయిల్ భాగస్వామ్యంతో దేశంలో E85 ఇంధన పంపిణీ కేంద్రాల ఏర్పాటును ప్రారంభించింది.
వివరాలు
అద్భుతమైన ఫీచర్లు ఇవే..
ఢిల్లీలో ప్రస్తుతం E85 ఇంధనం లీటర్కు రూ.82.12 ధరకు అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం విక్రయిస్తున్న E20 పెట్రోల్తో పోలిస్తే సుమారు రూ.20 తక్కువ. వినియోగదారులు ఇంధన రకాలను సులభంగా గుర్తించేలా E85 పంపులకు ప్రత్యేక బ్రాండింగ్, స్పష్టమైన లేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. దేశంలో ఎథనాల్ వినియోగాన్ని మరింత పెంచడం, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను బలోపేతం చేయడం వంటి ప్రభుత్వ లక్ష్యాల సాధనలో E85 ఇంధన పంపిణీ కీలక ముందడుగుగా భావిస్తున్నారు. అదే సమయంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల అందుబాటులోకి రావడం కూడా ఈ విస్తృత లక్ష్యాలకు మరింత బలం చేకూర్చనుంది.