Truck Parking On Highways: ట్రక్కుల పార్కింగ్పై సుప్రీంకోర్టు నో.. కొత్త రూల్స్ అమల్లోకి..
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై భారీ వాహనాలు, వాణిజ్య వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపడం, పార్క్ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. దేశంలోని మొత్తం రోడ్లలో కేవలం 2 శాతం మాత్రమే ఉన్న హైవేలు, మొత్తం ప్రమాదాల్లో దాదాపు 30 శాతం ప్రాణనష్టాలకు కారణమవుతున్నాయని కోర్టు గమనించింది. ముఖ్యంగా హైస్పీడ్ రోడ్లు ప్రమాదకర మార్గాలుగా మారకూడదని స్పష్టం చేసింది. అక్రమ పార్కింగ్ వంటి నివారించగల కారణాల వల్ల ఒక్క ప్రాణం పోయినా అది ప్రభుత్వ వైఫల్యమేనని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇకపై ట్రక్కులు, కమర్షియల్ వాహనాలు హైవే మీద లేదా పక్కనే ఆగడం కుదరదు.
వివరాలు
అమలు విషయంలో కూడా కోర్టు కఠిన ఆదేశాలు జారీ
కేవలం ప్రభుత్వం గుర్తించిన ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు, లే-బైలు, అనుమతించిన సౌకర్య కేంద్రాల్లో మాత్రమే ఆగాల్సి ఉంటుంది. రాత్రి వేళల్లో నిలిపిన వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. అమలు విషయంలో కూడా కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది.ఆధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలు, జీపీఎస్ ఫోటో ఆధారాలు,ఈ-చలాన్ విధానంతో పర్యవేక్షణ చేపట్టాలని సూచించింది. ఈ చర్యలను అమలు చేయడానికి ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర పోలీసులు, రవాణా శాఖలకు బాధ్యతలు అప్పగించింది. పూర్తి స్థాయిలో అమలు కోసం 60 రోజుల గడువు ఇచ్చింది. ఇక హైవే ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు తెలిపింది. హైవే పక్కన కొత్తగా ధాబాలు,వ్యాపార కేంద్రాలు నిర్మించడాన్ని నిషేధించింది.
వివరాలు
అనుమతి లేని నిర్మాణాలను 60 రోజుల్లో తొలగించాలని ఆదేశం
ఇప్పటికే ఉన్న అనుమతి లేని నిర్మాణాలను 60 రోజుల్లో తొలగించాలని ఆదేశించింది. జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సూచించింది. రోడ్డు భద్రత పెంచేందుకు ప్రమాద ప్రాంతాల్లో లైటింగ్ మెరుగుపరచడం, పర్యవేక్షణ పెంచడం, ట్రక్కుల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు సూచించింది. మొత్తంగా ఈ నిర్ణయం కఠిన అమలు, మౌలిక సదుపాయాల మెరుగుదల, బాధ్యతల స్పష్టతతో హైవేలను మరింత సురక్షితంగా మార్చే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.