LOADING...
DGCA chief: డీజీసీఏ కీలక ప్రకటన.. విమానయాన రంగానికి ఊతం
డీజీసీఏ కీలక ప్రకటన.. విమానయాన రంగానికి ఊతం

DGCA chief: డీజీసీఏ కీలక ప్రకటన.. విమానయాన రంగానికి ఊతం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

విమానయాన సంస్థలు సులభంగా వ్యాపారం చేసుకునేలా, వాటి వృద్ధికి అవసరమైన సహకారం అందిస్తున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. అదే సమయంలో ప్రయాణికుల హక్కుల పరిరక్షణకు కూడా కట్టుబడి పనిచేస్తున్నామని డీజీసీఏ అధిపతి ఫయాజ్ అహ్మద్ కిద్వాయ్ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమానయాన రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. యుద్ధ పరిస్థితుల కారణంగా కొన్ని దేశాలు గగనతల ఆంక్షలు విధించడంతో విమానాలు పొడవైన మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోందన్నారు. దీనివల్ల విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఖర్చులు పెరగడంతో పాటు కార్యకలాపాల వ్యయాలు కూడా అధికమయ్యాయని వివరించారు. అయినప్పటికీ త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

నియంత్రణ చర్యలు

భారత పౌర విమానయాన మార్కెట్ వృద్ధిని దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కలిసి పలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. డిసెంబరులో ఇండిగో విమాన కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడిన సమయంలో ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను అధికంగా పెంచకుండా నియంత్రణ చర్యలు తీసుకున్నట్లు గుర్తుచేశారు. ఆ సమయంలో విధించిన గరిష్ఠ ధర పరిమితిని ఇటీవల తొలగించినట్లు తెలిపారు.

వివరాలు 

ఎయిరిండియాలో తప్పిదం.. అధికారిపై చర్యలు

గత వారం కెనడాలోని వాంకోవర్‌కు వెళ్లాల్సిన విమానానికి సంబంధించిన తప్పిదంపై డీజీసీఏ తీవ్రంగా స్పందించింది. అనుమతి ఉన్న విమానం బదులు వేరే విమానాన్ని పంపినందుకు ఎయిరిండియాకు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యుడైన అధికారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. వాంకోవర్ మార్గానికి బోయింగ్ 777-300 ఈఆర్ విమానానికి మాత్రమే అనుమతి ఉండగా, బోయింగ్ 777-200 ఎల్‌ఆర్ విమానాన్ని పంపడం జరిగింది. దీనిని కెనడా అధికారులు అనుమతించకపోవడంతో విమానం సుమారు 7 గంటల ప్రయాణం తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుంది.

Advertisement