Amazon: అమెజాన్ ఇండియా భారీ పెట్టుబడి.. రూ.2,800 కోట్లతో విస్తరణ
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకలాపాల నెట్వర్క్ను విస్తరించేందుకు అమెజాన్ ఇండియా రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని ప్రకటించింది. వ్యాపార విస్తరణ, ఏఐ ఆధారిత డిజిటలీకరణ, ఎగుమతుల వృద్ధి, ఉద్యోగ కల్పన వంటి లక్ష్యాలతో 2030 నాటికి భారత్లో 35 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.26 లక్షల కోట్ల)కు పైగా పెట్టుబడి పెట్టే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు నిమిషాలు, గంటలు, రోజుల్లో సేవలు అందించేందుకు ప్రధాన కార్యకలాపాలు, క్విక్ కామర్స్ సేవలను విస్తరిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
వివరాలు
రూ.2,000 కోట్ల పెట్టుబడికి కొనసాగింపు
'ప్రాజెక్ట్ ఆశ్రయ్' కింద ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించడంతో పాటు వైద్య, ప్రమాద బీమా సదుపాయాలను మెరుగుపరచనున్నట్లు పేర్కొంది. అదనంగా 10,000 మంది ఉద్యోగులు, 2 లక్షలకు పైగా కమ్యూనిటీ సభ్యులు ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 2025లో పెట్టిన రూ.2,000 కోట్ల పెట్టుబడికి కొనసాగింపుగా తాజా పెట్టుబడి ఉందని కంపెనీ వెల్లడించింది. ఆ పెట్టుబడితో దేశవ్యాప్తంగా 17 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, 6 సార్టేషన్ కేంద్రాలు, 75 లాస్ట్-మైల్ డెలివరీ స్టేషన్లు ప్రారంభించినట్లు తెలిపింది. అదే ఏడాది 'అమెజాన్ నౌ' క్విక్ కామర్స్ సేవను ప్రారంభించి, కీలక నగరాల్లో 300కు పైగా మైక్రో-ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలకు విస్తరించినట్లు వివరించింది.
వివరాలు
ఉద్యోగులే బలం: అభినవ్ సింగ్
2013లో అమెజాన్.ఇన్ ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సురక్షితమైన, వేగవంతమైన, విశ్వసనీయమైన కార్యకలాపాల నెట్వర్క్ను నిర్మించామని అమెజాన్ ఇండియా, ఆస్ట్రేలియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. దేశంలోని ప్రతి పిన్కోడ్లో వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని, ఈ విజయానికి ఉద్యోగులే కీలకమని అన్నారు. అందుకే ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సులో ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.