Amazon: మార్కెట్ వాటా కోసం అమెజాన్ భారీ ఆఫర్లు.. క్విక్ కామర్స్లో కొత్త పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో క్విక్ కామర్స్ రంగంలో మార్కెట్ వాటా పెంచుకోవడానికి అమెజాన్ దూకుడు మరింత పెంచింది. బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జప్టో, ఫ్లిప్కార్ట్ మినిట్స్, బిగ్బాస్కెట్, ఫస్ట్క్లబ్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ క్యాష్బ్యాక్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ప్రస్తుతం రూ.1,499కు పైగా ఆర్డర్లపై గరిష్టంగా రూ.200 వరకు, రూ.399కు పైగా కొనుగోళ్లపై రూ.50 వరకు క్యాష్బ్యాక్ అందిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తొలి ఆర్డర్లలో రూ.300కు పైగా కొనుగోలు చేస్తే రూ.100 క్యాష్బ్యాక్ అందిస్తోంది. అంతేకాదు, అనేక ఆర్డర్లపై ఉచిత డెలివరీతో పాటు ప్లాట్ఫామ్ ఫీజును కూడా మాఫీ చేస్తోంది.
వివరాలు
మార్కెట్లో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించి వాటాను పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశ్యం
మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం,ఈ ఆఫర్ల లక్ష్యం ధరల యుద్ధాన్ని ప్రారంభించడం కాదు. మార్కెట్లో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించి వాటాను పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. భారీ ఆర్థిక సామర్థ్యం కలిగిన అమెజాన్ దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టగలదని,దీంతో ఇతర సంస్థలు కూడా కొత్త కస్టమర్లను సంపాదించేందుకు మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్కు క్లౌడ్ సేవలు, కృత్రిమ మేధస్సు వ్యాపారాలు ప్రధాన ప్రాధాన్యం అయినప్పటికీ, భారత క్విక్ కామర్స్ మార్కెట్లో పెట్టుబడులు కొనసాగించే ఆర్థిక బలం సంస్థకు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్లో లిస్టెడ్గా ఉన్న స్విగ్గీ, ఎటర్నల్ వంటి సంస్థలు మాత్రం నగదు వ్యయం, లాభదాయకతపై పెట్టుబడిదారుల పర్యవేక్షణను ఎదుర్కొంటున్నాయి.
వివరాలు
బ్లింకిట్ లేదా ఇన్స్టామార్ట్కు అతిపెద్ద పోటీదారు అమెజాన్
"ప్రస్తుతం బ్లింకిట్ లేదా ఇన్స్టామార్ట్కు అతిపెద్ద పోటీదారు ఎవరు అంటే అది అమెజానే" అని ఇంటర్నెట్ రంగానికి చెందిన ఓ సీనియర్ విశ్లేషకుడు పేర్కొన్నారు. ప్రస్తుతం అమెజాన్ పూర్తిగా విస్తరణపై దృష్టి పెట్టిందని, లాభాల కంటే మార్కెట్ వాటా పెంపుకే ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రభావం ఇప్పటికే కనిపించడం ప్రారంభమైంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ పెట్టుబడులు పెంచుతున్న నేపథ్యంలో మార్కెట్ పోటీ మరింత తీవ్రమవుతుందనే ఆందోళనతో ఎటర్నల్, స్విగ్గీ సంస్థల మార్కెట్ విలువ కలిపి ఇటీవల గరిష్ట స్థాయి నుంచి 15 బిలియన్ డాలర్లకు పైగా తగ్గినట్లు బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది.
వివరాలు
2030 నాటికి భారత్లో మరో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్న అమెజాన్
క్విక్ డెలివరీ మోడల్పై ఎన్నో సంవత్సరాలు ప్రయోగాలు చేసిన అనంతరం అమెజాన్ ఇప్పుడు 'అమెజాన్ నౌ' సేవలను వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల ఈ సేవలను దేశవ్యాప్తంగా 300కు పైగా నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. అలాగే 2030 నాటికి భారత్లో మరో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ వెల్లడించారు. దీంతో దేశంలో సంస్థ ప్రకటించిన మొత్తం పెట్టుబడులు 48 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. ఈ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం కృత్రిమ మేధస్సు, క్లౌడ్ మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించినప్పటికీ, భారత వ్యాపారాల విస్తరణకు కూడా ఇది బలం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
వివరాలు
అమెజాన్ ఈ స్థాయిలో క్యాష్బ్యాక్లు ఇవ్వడానికి కారణం..
అంతకుముందే అమెజాన్ నౌ మౌలిక వసతుల అభివృద్ధి,మైక్రో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాల విస్తరణ కోసం రూ.2,800 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. క్విక్ కామర్స్లో సరైన వ్యాపార నమూనాను రూపొందించేందుకు ఎన్నో సంవత్సరాలు పట్టిందని, ప్రస్తుతం ఈ విభాగం ప్రతి త్రైమాసికం దాదాపు రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తోందని ఆండీ జాస్సీ ఇటీవల తెలిపారు. అయితే అమెజాన్ ఈ స్థాయిలో క్యాష్బ్యాక్లు ఇవ్వడానికి మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం సంస్థ నిర్వహిస్తున్న ప్రతి డార్క్ స్టోర్ రోజుకు సగటున 600 నుంచి 700 ఆర్డర్లను మాత్రమే ప్రాసెస్ చేస్తోంది. అదే సమయంలో బ్లింకిట్లో రోజుకు 1,300కు పైగా,జప్టోలో సుమారు 1,200,ఫ్లిప్కార్ట్ మినిట్స్లో 900 నుంచి 1,000, స్విగ్గీ ఇన్స్టామార్ట్లో 1,034 వరకు ఆర్డర్లు నమోదవుతున్నాయి.
వివరాలు
ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడం అమెజాన్కు అత్యవసరం
ఈ తేడాను తగ్గించేందుకు ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడం అమెజాన్కు అత్యవసరంగా మారింది. ఈ కారణంగా క్యాష్బ్యాక్లు,ఉచిత డెలివరీ, ఫీజు మినహాయింపులను తాత్కాలికంగా వినియోగదారులను సంపాదించేందుకు ఉపయోగిస్తున్న వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆదాయంపై దృష్టి పెట్టినప్పుడు మిగతా సంస్థల మాదిరిగానే అమెజాన్ కూడా లాభదాయకతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం అమెజాన్ లక్ష్యం పూర్తిగా కొత్త కస్టమర్లను వెతకడం కాదు. ఇప్పటికే ఉన్న ప్రైమ్ సభ్యులు, సాధారణ కొనుగోలుదారులను తిరిగి 'అమెజాన్ నౌ' సేవలవైపు తీసుకురావడమే ప్రధాన వ్యూహమని డాటమ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థాపకుడు సతీష్ మీనా తెలిపారు. తగ్గింపులతో పాటు విభిన్న ఉత్పత్తులు, సౌకర్యవంతమైన సేవలు, అమెజాన్ విస్తృత ఎకోసిస్టమ్ కూడా సంస్థకు బలంగా మారుతాయని ఆయన చెప్పారు.
వివరాలు
క్విక్ కామర్స్ విస్తరణను వేగవంతం చేస్తున్న ఫ్లిప్కార్ట్
మరోవైపు ఫ్లిప్కార్ట్ కూడా క్విక్ కామర్స్ విస్తరణను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే వెయ్యికి పైగా డార్క్ స్టోర్లను ఏర్పాటు చేసిన సంస్థ,2026 చివరినాటికి వాటి సంఖ్యను 1,500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్లింకిట్,జప్టో, ఇన్స్టామార్ట్ ప్రధానంగా మెట్రో నగరాలపై దృష్టి పెడుతుండగా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మాత్రం రెండు,మూడో శ్రేణి నగరాల్లో అవకాశాలను వినియోగించుకోవడానికి ముందుకు సాగుతున్నాయి. దీంతో దేశంలోని అతిపెద్ద రిటైల్,ఈ-కామర్స్ సంస్థలు ఇప్పుడు ప్రత్యేక క్విక్ కామర్స్ సంస్థలతో నేరుగా పోటీ పడుతున్నాయి. వినియోగదారులు మాత్రం మరిన్ని ఆఫర్లు,వేగవంతమైన డెలివరీ సేవల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అయితే కంపెనీలకు మాత్రం ఈ పోటీ మరింత ఖర్చుతో కూడుకున్నదిగా,లాభదాయకతను ఆలస్యం చేసే దిశగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.