Apple: మసిమో పేటెంట్ ఉల్లంఘన కేసులో ఆపిల్కు భారీ షాక్: ₹630 మిలియన్ల భారీ జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
కాలిఫోర్నియాలోని ఫెడరల్ జ్యూరీ,రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కొలిచే టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ను ఉల్లంఘించినందుకు,టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ మసిమోకు 630 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఆపిల్ వాచ్లో ఉన్న వర్కౌట్ మోడ్, హార్ట్రేట్ నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు మసిమో పేటెంట్ హక్కులను అతిక్రమించాయని జ్యూరీ తేల్చింది. మసిమో ఈ తీర్పును తమ ఆవిష్కరణలు, మేధోసంపత్తిని రక్షించుకునే ప్రయత్నాల్లో "మంచి విజయం"గా అభివర్ణించింది. మసిమో ఈ కేసులో 634 నుండి 749మిలియన్ డాలర్ల వరకు రాయల్టీలు కోరగా,ఆపిల్ మాత్రం 3 నుంచి 6 మిలియన్ డాలర్లకే నష్టపరిహారం పరిమితం కావాలని వాదించింది. అసలు కేసు విషయానికొస్తే..మెడికల్ గ్రేడ్ టెక్ను ఆపిల్ తన వేర్బుల్స్లో అనుమతి లేకుండా వాడిందా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న.
వివరాలు
మసిమో వివిధ కోర్టుల్లో ఆపిల్పై కేసులు
ఇక ఆపిల్ మాత్రం ఈ తీర్పును అప్పీల్ చేయనున్నట్లు వెల్లడించింది. తమపై కేసు పెట్టిన పేటెంట్ 2022లోనే గడువు ముగిసిందని, అది కూడా దశాబ్దాల క్రితం వాడిన పేషెంట్ మానిటరింగ్ టెక్నాలజీపై ఆధారపడి ఉన్నదని ఆపిల్ వాదిస్తోంది. అంతేకాక,మసిమో ఇప్పటి వరకు 25 కంటే ఎక్కువ పేటెంట్లతో వివిధ కోర్టుల్లో ఆపిల్పై కేసులు వేశాయని,అందులో చాలావాటిని కోర్టులు చెల్లనివిగా తేల్చేశాయని ఆపిల్ గుర్తుచేసింది.
వివరాలు
బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ ఫీచర్ను తొలగించిన ఆపిల్
ఈ న్యాయపోరాటం ఇప్పటికే ఆపిల్ ఉత్పత్తులపై ప్రభావం చూపింది. 2023లో అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్ (ITC) పేటెంట్ ఉల్లంఘన కారణంగా కొన్ని ఆపిల్ వాచ్ మోడల్స్ దిగుమతిపై నిషేధం విధించింది. దీంతో ఆపిల్ తమ వాచ్ల్లో బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ ఫీచర్ను తొలగించాల్సి వచ్చింది. తరువాత యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అనుమతితో, ఆపిల్ మార్పులు చేసిన కొత్త మోడల్ను విడుదల చేసింది.