LOADING...
Car: ఈఎంఐ భారం లేకుండా కారు కొనాలంటే ఈ పెట్టుబడి మార్గం ఉత్తమం
ఈఎంఐ భారం లేకుండా కారు కొనాలంటే ఈ పెట్టుబడి మార్గం ఉత్తమం

Car: ఈఎంఐ భారం లేకుండా కారు కొనాలంటే ఈ పెట్టుబడి మార్గం ఉత్తమం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటి పరిస్థితుల్లో స్వంతంగా కారు ఉండటం విలాసం కాదు,అవసరంగా మారింది. అయితే కారు కొనాలనే ఆలోచన వచ్చిన వెంటనే ఎక్కువ మందికి కలిగే ప్రశ్న - దానికి కావాల్సిన డబ్బు ఎలా ఏర్పాటు చేయాలి? ఎంత మొత్తాన్ని ముందుగా సేవ్‌ చేయాలి? సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ముందుకెళితే, కారు కొనుగోలు భవిష్యత్తులో భారంగా అనిపించే ప్రమాదం ఉంటుంది. కానీ ముందుగానే క్రమబద్ధమైన ప్లాన్‌ చేసుకుంటే ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా మీ ఇంటి ముందుకు కొత్త కారు చేరుతుంది. కారు కొనుగోలులో మొదటి అడుగు బడ్జెట్‌ను స్పష్టంగా నిర్ణయించుకోవడం. ప్రస్తుతం మార్కెట్లో మధ్య తరగతి కార్ల ధరలు సుమారు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉన్నాయి.

వివరాలు 

కారు కొనడానికి మొదటి మార్గం 

మీ ఆదాయం, కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అభిరుచులు బట్టి ఈ మొత్తం మారవచ్చు. ఒకసారి మీరు ధరను నిర్ణయించుకున్నాక, తరువాత దాన్ని పెంచకుండా ఉండటం మంచిది. ఉదాహరణకు, మీరు రూ.7 లక్షల కారు కొనాలని నిర్ణయించుకున్నట్లయితే అదే పరిమితిలో ఆలోచించడం ఉత్తమం. కారు కొనడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. మొదటిది కారు రుణం తీసుకోవడం.దీని ద్వారా వెంటనే కారు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం చాలా బ్యాంకులు వాహనం విలువలో 80-90 శాతం వరకు రుణంగా ఇస్తున్నాయి. మిగిలిన 20 శాతం మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌గా చెల్లించాలి. అంటే రూ.7 లక్షల కారు కొంటే సుమారు రూ.1.4 లక్షలు ముందుగా చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని 7 సంవత్సరాల వరకు ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు.

వివరాలు 

కారు కొనడానికి రెండో మార్గం

రెండో మార్గం కొంతకాలం ఆగి డబ్బు సేవ్‌ చేసి కొనుగోలు చేయడం. ఈ విధానంలో వాయిదాల భారం ఉండదు. కారు లోన్‌ సులభంగా అనిపించినా, దీని వల్ల అసలు ధర కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. వడ్డీతో పాటు ప్రాసెసింగ్‌ ఫీజులు, జీఎస్‌టీ వంటి అదనపు ఖర్చులు ఉంటాయి. అంతేకాకుండా దాదాపు 7 సంవత్సరాల పాటు ప్రతి నెలా ఈఎంఐ చెల్లించడం ఒక నిరంతర బాధ్యతగా మారుతుంది. అదే ముందుగా సేవ్‌ చేసి కొనుగోలు చేస్తే ఈ అదనపు ఖర్చులు తగ్గుతాయి, ఆర్థికంగా ప్రశాంతత కూడా లభిస్తుంది.

Advertisement

వివరాలు 

భారత్‌లో కార్ల ధరలు సంవత్సరానికి సగటున 10 శాతం పెరుగుతున్నాయి

ఒకవేళ మీరు అయిదేళ్ల తరువాత కారు కొనాలని లక్ష్యంగా పెట్టుకుంటే,అప్పటికి ధర ఎంత పెరుగుతుందో అంచనా వేయడం చాలా ముఖ్యం. గత పదేళ్ల ధోరణి ప్రకారం భారత్‌లో కార్ల ధరలు సంవత్సరానికి సగటున 10 శాతం పెరుగుతున్నాయి. ఇదే పెరుగుదల కొనసాగితే, ప్రస్తుతం రూ.7 లక్షల కారు అయిదేళ్లలో సుమారు రూ.11.27 లక్షలకు చేరవచ్చు. కాబట్టి మీ పొదుపు లక్ష్యం కూడా రూ.11.27 లక్షలుగా ఉండాలి. ఈ మొత్తాన్ని సమకూర్చడానికి సరైన పెట్టుబడి ఎంపిక అవసరం. అయిదేళ్ల గడువు కోసం పూర్తిగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం కొంత రిస్క్‌తో కూడుకున్నది. అందుకే హైబ్రిడ్‌ ఫండ్లు మంచి ప్రత్యామ్నాయం. ఇవి ఈక్విటీతో పాటు డెట్‌ పత్రాలలో కూడా పెట్టుబడి పెడతాయి.

Advertisement

వివరాలు 

సగటు రాబడుల ఆధారంగా నెలవారీగా పొదుపు

మార్కెట్‌ మంచి స్థితిలో ఉన్నప్పుడు ఈక్విటీ ద్వారా లాభాలు పొందేఅవకాశం ఉంటుంది. మార్కెట్‌లో ఒడిదొడుకులు వచ్చినప్పుడు డెట్‌ భాగం కొంత రక్షణ ఇస్తుంది. మ్యూచువల్‌ ఫండ్లలో క్రమంగా పెట్టుబడి పెట్టే విధానం(సిప్‌)ద్వారా లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. రూ.11.27లక్షల లక్ష్యాన్ని సాధించడానికి సగటు రాబడుల ఆధారంగా నెలవారీగా పొదుపు చేయాల్సిన మొత్తం ఇలా ఉంటుంది. 8శాతం రాబడి ఉంటే నెలకు సుమారు రూ.15,240పెట్టాలి.10శాతం రాబడి ఉంటే రూ.14,436చాలు. 12శాతం రాబడి ఉంటే రూ.13,670సరిపోతుంది.ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం గరిష్ఠంగా నెలకు రూ.15,240సేవ్‌ చేయగలిగితే సురక్షితం. ఒకవేళ రాబడి 8శాతం కంటే ఎక్కువగా వస్తే,అదనంగా లభించిన మొత్తంతో మీరు భావించిన దానికంటే మెరుగైన మోడల్‌ లేదా ప్రీమియం కారు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.

Advertisement