Nirmala Sitharaman: బ్యాంక్ లాకర్ బీమాపై స్పష్టత.. ఆర్బీఐ పరిహార నిబంధనలపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాంకు లాకర్లలో భద్రపరిచే విలువైన వస్తువులకు సంబంధించిన బీమా కవరేజీ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. లాకర్లో వినియోగదారులు ఉంచే వస్తువులను బ్యాంకు అధికారులు పరిశీలించరని, వాటి వివరాలను ఎక్కడా నమోదు చేయరని ఆమె తెలిపారు. ఈ కారణంగా వాటి అసలు విలువ ఆధారంగా బీమా కవరేజీ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. లోక్సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించగా, మంత్రి దీనిపై సమాధానం ఇచ్చారు. బ్యాంకు లాకర్లలో ఉన్న వస్తువులను తనిఖీ చేయడం బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు వరకు పరిహారం
ఆమె వివరించిన ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం దొంగతనం, అగ్ని ప్రమాదం, లేదా బ్యాంకులో మోసాల కారణంగా వినియోగదారులకు నష్టం కలిగితే మాత్రమే పరిహారం అందిస్తాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారం, లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు వరకు పరిహారం అందజేస్తున్నారు. లాకర్లో ఉన్న వస్తువులపై బ్యాంకులకు ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల వాటి విలువ ఆధారంగా పరిహారం ఇవ్వడం సాధ్యంకాదని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా, లాకర్ బీమా కవరేజీపై కొత్త ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలించడం లేదని వెల్లడించారు.