Page Loader
cholera vaccine HillChol: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'హిల్‌కాల్' కలరా టీకా.. క్లినికల్‌ పరీక్షల్లో విజయవంతం
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'హిల్‌కాల్' కలరా టీకా.. క్లినికల్‌ పరీక్షల్లో విజయవంతం

cholera vaccine HillChol: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'హిల్‌కాల్' కలరా టీకా.. క్లినికల్‌ పరీక్షల్లో విజయవంతం

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ బయోటెక్ రూపొందించిన నోటి ద్వారా తీసుకునే కలరా టీకా 'హిల్‌కాల్' తృతీయ దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైన ఫలితాలను సాధించింది. కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా,ఇనబా అనే రెండు సెరోటైపులపై ఈ టీకా సమర్థంగా పని చేస్తుందని పరిశోధనల్లో నిర్ధారణ అయింది. ఫలితంగా పిల్లలు,పెద్దలను కలరా నుంచి రక్షించే అవకాశం ఈ టీకాతో ఉంది. ఈ టీకా ఓరల్ కలరా వ్యాక్సిన్ (OCV)అయిన హిల్‌కాల్‌ను నోటి ద్వారా తీసుకోవడం మరో ప్రత్యేకత. ఈ టీకాపై నిర్వహించిన మూడవ దశ పరీక్షల ఫలితాలను 'సైన్స్ డైరెక్ట్‌'కు చెందిన 'వాక్సిన్' అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించారు. దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో మొత్తం 1,800 మంది పెద్దలు, పిల్లలపై ఈ టీకాను ప్రయోగాత్మకంగా పరీక్షించారు.

వివరాలు 

వర్ధమాన దేశాలకూ మేలు 

ఈ పరీక్షల సందర్భంగా టీకా తీసుకున్నవారిలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరిగినట్టు గుర్తించారు. అలాగే వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకపోవడం వల్ల ఈ టీకా భద్రమైందని తేలింది. ఈ నివేదికల ఆధారంగా సంబంధిత నియంత్రణ సంస్థలకు సమాచారం పంపించి, అవసరమైన అనుమతులు పొందిన తర్వాత దీన్ని మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కలరా వ్యాధిని టీకా ద్వారా నియంత్రించవచ్చని అభిప్రాయపడిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల మాట్లాడుతూ,ఇప్పటి వరకు ఈ వ్యాధికి సరిపడే టీకాలు పరిమితంగా ఉండటం వల్ల వ్యాధి నివారణలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.

వివరాలు 

ఏటా 95,000 మంది మృతి 

అయితే నోటి ద్వారా తీసుకునే ఈ హిల్‌కాల్ టీకా ద్వారా వ్యాధి వ్యాప్తిని సమర్థంగా నిరోధించవచ్చని, ఇదో తక్కువ వ్యయంతో లభించే పరిష్కారం అని అన్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఆహారం,తాగునీటిలో కలుషితం వల్ల కలరా వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. గ్లోబల్ స్థాయిలో ఏటా సుమారుగా 28 లక్షల మందికి ఈ వ్యాధి సోకుతుండగా, వారిలో దాదాపు 95,000 మంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కలరా నివారణకు నోటి ద్వారా తీసుకునే టీకాల విక్రయాలు సంవత్సరానికి దాదాపు 10 కోట్ల డోసులు వరకు ఉంటున్నాయి. అయితే ప్రపంచంలో ఒక్కటే సంస్థ ఈ రకమైన టీకాను సరఫరా చేస్తుండటంతో, టీకా లభ్యతపై అనేక సవాళ్లు నెలకొన్నాయి.

వివరాలు 

20 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భారత్ బయోటెక్ తన హైదరాబాద్, భువనేశ్వర్ యూనిట్లలో కలిపి సంవత్సరానికి 20 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.