BPCL LPG cylinder: ఆగస్టు 15 నాటికి 100 నగరాలకు బీపీసీఎల్ 10 కేజీ ఎల్పీజీ సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వరంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)తన 10 కేజీల ఎల్పీజీ సిలిండర్ల సేవలను దేశవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 15 నాటికి 24రాష్ట్రాల్లోని 100నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల అనంతరం నిర్వహించిన ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్లో సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులకు ఎల్పీజీ కనెక్షన్ను తక్షణమే అందించడంతో పాటు,గ్యాస్ సిలిండర్ను వేగంగా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో భారత్ గ్యాస్ ఇటీవల'లైట్ జిప్'పేరుతో ప్రీమియం ఎల్పీజీ సేవలను ప్రారంభించింది. ఈ సేవలో భాగంగా అందిస్తున్న 10కేజీల సిలిండర్లు తక్కువ బరువుతో ఉండటమే కాకుండా,తుప్పు పట్టకుండా ప్రత్యేకంగా తయారు చేశారు. దీంతో వీటిని మోయడం,తరలించడం వినియోగదారులకు మరింత సులభంగా ఉంటుంది.
వివరాలు
ఎక్స్ప్రెస్ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టిన బీపీసీఎల్
ఇదే తరహాలో మరో ప్రభుత్వరంగ చమురు సంస్థ హెచ్పీసీఎల్ కూడా ఇటీవల 'నవ్య' పేరుతో 10 కేజీల ఎల్పీజీ సిలిండర్ సేవలను ప్రారంభించింది.
ఈ పోటీ నేపథ్యంలో బీపీసీఎల్ కూడా ఎక్స్ప్రెస్ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టింది.
ఆగస్టు 15 నాటికి ఈ సేవలను 100 నగరాలకు విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది.
ఇక కంపెనీ ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బీపీసీఎల్ రూ.3,962.13 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
గత 15 త్రైమాసికాల్లో కంపెనీకి ఇదే తొలి నష్టం కావడం గమనార్హం.
గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6,123.93 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో 50 శాతం పెరిగిన ముడిచమురు ధరలు
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు సుమారు 50 శాతం వరకు పెరిగాయి.
అయితే, దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రిటైల్ ధరలను అదే స్థాయిలో పెంచకపోవడంతో కంపెనీపై ఆర్థిక భారం పడిందని బీపీసీఎల్ వెల్లడించింది.
ముఖ్యంగా సమీక్షిస్తున్న త్రైమాసికంలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల విక్రయాల కారణంగానే కంపెనీకి రూ.3,485.22 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది.