China: అమెరికా కంపెనీలపై చైనా కఠిన చర్యలు.. 46 సంస్థలకు ప్రభుత్వ టెండర్లలో నో ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. అమెరికాకు చెందిన 10 కంపెనీలపై ఎగుమతి నియంత్రణలు విధించిన చైనా,మరో 46 సంస్థలను ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియల నుంచి నిషేధించింది. అమెరికా తీసుకుంటున్న చర్యలకు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా ప్రకటించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం,అమెరికాకు చెందిన కొన్ని రక్షణ రంగ సంస్థలు,డ్రోన్ తయారీ కంపెనీలు,ఇతర సంస్థలకు ద్వంద్వ వినియోగ (డ్యూయల్-యూజ్) ఉత్పత్తుల ఎగుమతిని నిలిపివేశారు. ఈ జాబితాలో అవియాక్స్ (Aveox),రెడ్ క్యాట్ హోల్డింగ్స్ (Red Cat Holdings),టియల్ డ్రోన్స్ (Teal Drones),జయా రోబోటిక్స్ (Jaia Robotics)వంటి సంస్థలు ఉన్నాయి. పౌర, సైనిక అవసరాలకు ఉపయోగపడే సాంకేతికతలు, పదార్థాలు, ఉత్పత్తులను ఈ కంపెనీలకు సరఫరా చేయడాన్ని చైనా నిషేధించింది.
వివరాలు
అమెరికా ప్రభుత్వం చేపడుతున్న "దురుద్దేశపూరిత చర్యలకు" ప్రతీకారంగానే ఈ నిర్ణయం
అంతేకాకుండా, ఏ దేశం లేదా ప్రాంతానికి చెందిన సంస్థలు, వ్యక్తులు కూడా చైనా మూలం కలిగిన డ్యూయల్-యూజ్ ఉత్పత్తులను ఈ అమెరికా కంపెనీలకు బదిలీ చేయకూడదని స్పష్టం చేసింది. ఇటీవల అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) చైనా సైన్యంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ పలు చైనా కంపెనీలను తన "చైనీస్ మిలిటరీ కంపెనీస్" జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలోనే చైనా తాజా ఆంక్షలు విధించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం చేపడుతున్న "దురుద్దేశపూరిత చర్యలకు" ప్రతీకారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
వివరాలు
చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం
పెంటగాన్ తాజా జాబితాలో చైనాకు చెందిన ప్రముఖ సంస్థలు అయిన Tencent, Huawei, CATL, DJI, China Mobile, China Telecom, Hikvision వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో చేరడం వల్ల తక్షణ ఆంక్షలు విధించకపోయినా,భవిష్యత్తులో ఎగుమతి నియంత్రణలు లేదా కొనుగోలు నిషేధాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన 46 కంపెనీలను ప్రభుత్వ కొనుగోలు కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధించింది. ఇందులో ప్రముఖ రక్షణ సంస్థలు అయిన Lockheed Martin, Raytheon, Boeing Defense ఉన్నాయి. అయితే చైనాలో స్థానిక పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనుబంధ సంస్థలకు ఈ నిషేధం వర్తించదని అధికారులు వెల్లడించారు.