Crude oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 2% పెరిగిన ముడి చమురు ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ప్రస్తుతం ఒక హై- ఓల్టేజ్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్లో ఒక బారెల్ ధర వంద డాలర్ల స్థాయి వద్ద పైకీ కిందకీ మారుతూ పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు శాంతి చర్చలపై ఉన్న ఆశలు తగ్గిపోవడం,మరోవైపు అమెరికా అధ్యక్షుడు తన సామాజిక మాధ్యమ వేదిక ద్వారా చేసిన ప్రకటనలతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. ఇరాన్ ప్రతినిధులతో జరగాల్సిన చర్చల కోసం వెళ్లాల్సిన తన బృందాన్ని అమెరికా అధ్యక్షుడు ఆకస్మికంగా రద్దు చేశారు. ప్రయాణాలకు సమయం వృథా అవుతోందని,అక్కడ ఎవరి మాట ఎవరు వినడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
101 డాలర్ల స్థాయికి చమురు
ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆదివారం రాత్రి ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి ఒక బారెల్కు 107 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ విప్లవ గార్డులు రెండు సరకు నౌకలను స్వాధీనం చేసుకున్నారన్న సమాచారం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అయితే సోమవారం ఉదయానికి మార్కెట్ కొంత స్థిరపడటంతో ధరలు 101 డాలర్ల స్థాయికి తగ్గాయి. మరోవైపు అమెరికా ముడి చమురు ధరలు కూడా 96 డాలర్ల వద్ద మారుతూ అస్థిరంగా కొనసాగుతున్నాయి. గత తొమ్మిది వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధి మూతపడటంతో సముద్ర మార్గ రవాణా దాదాపు నిలిచిపోయినట్లు సమాచారం.
వివరాలు
ఆంక్షలు,బెదిరింపుల మధ్య చర్చలు జరగవు: ఇరాన్ అధ్యక్షుడు
దీని ప్రభావం ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్రంగా పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇరాన్ అధ్యక్షుడు కూడా తన వైఖరిని మార్చేలా కనిపించడం లేదు. ఆంక్షలు, బెదిరింపుల మధ్య చర్చలు జరగవని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు తమ వద్దే అన్ని అవకాశాలు ఉన్నాయని, మాట్లాడాలంటే ఇరాన్ ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఈ ఇద్దరు దేశాధినేతల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీలో చమురు ధరలు ఎటువైపు దూసుకెళ్తాయోనన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఈ వారం చివరికి శాంతి ఒప్పందం కుదురుతుందా లేక ధరలు మళ్లీ పెరుగుతాయా అన్నది ఇంకా అనిశ్చితిగానే ఉంది.