Crude oil: హర్మూజ్ మూతపడితే.. ముడి చమురు ధర 200 డాలర్లకు చేరే ప్రమాదం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో హర్మూజ్ జలసంధి మూతపడటం ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. పరిస్థితులు మరింత విషమిస్తే బ్యారెల్ ముడి చమురు ధర 200 డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని డేటా విశ్లేషణ సంస్థ ఉడ్ మెకెంజీ(Wood Mackenzie)హెచ్చరించింది. అలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఇరాన్ యుద్ధం తర్వాత ప్రపంచ ఇంధన రంగంలో భారీ అనిశ్చితి నెలకొంది. చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతుండగా,వడ్డీ రేట్ల పెంపుపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
2026 చివరినాటికి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 80 డాలర్లకు తగ్గే అవకాశం
ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి సరఫరా అయ్యే రోజుకు సుమారు 11 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా ప్రభావితమైంది. అదేవిధంగా ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో దాదాపు 20 శాతానికి సమానమైన 80 మిలియన్ టన్నుల ద్రవీభవించిన సహజ వాయువు సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. హర్మూజ్ జలసంధి ఎప్పుడు తిరిగి తెరుచుకుంటుందన్నదానిపైనే అంతర్జాతీయ చమురు, వాయువు ధరలు అలాగే ఇంధన డిమాండ్ ఆధారపడి ఉంటాయని ఉడ్ మెకంజీ పేర్కొంది. జూన్ నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే 2026 చివరినాటికి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 80 డాలర్లకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో అది 65 డాలర్ల వరకు పడిపోవచ్చని తెలిపింది.
వివరాలు
ప్రపంచ ఆర్థిక వృద్ధి 0.4 శాతం వరకు తగ్గచ్చు
అయితే చర్చలు ఆలస్యమై అక్టోబర్ వరకు హర్మూజ్ మార్గం మూసి ఉంటే 2026 ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా స్వల్ప ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఒకవేళ ఈ ఏడాది చివరివరకు జలసంధి మూతపడిన పరిస్థితి కొనసాగితే ముడి చమురు ధరలు 200 డాలర్ల స్థాయిని తాకవచ్చని హెచ్చరించింది. దీని ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి 0.4 శాతం వరకు తగ్గొచ్చని పేర్కొంది. ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే ఆసియా, యూరప్ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉందని ఉడ్ మెకంజీ అంచనా వేసింది. అదే సమయంలో అమెరికా నుంచి ఎల్ఎన్జీ దిగుమతులకు గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పెరగవచ్చని తెలిపింది.