Crude oil prices: ప్రపంచ ఇంధన మార్కెట్కు ఊరట.. ముడి చమురు ధరలు భారీగా పతనం
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి దిశగా ముందడుగు వేయడంతో క్రూడ్ ఆయిల్ మార్కెట్లో ఒక్కసారిగా మార్పులు కనిపించాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి చమురు ధర సుమారు 6 శాతం మేర తగ్గి బ్యారెల్కు 88.3 డాలర్ల వద్దకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 93 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది. మొత్తం మీద మే నెలలో చమురు ధరలు 16 నుంచి 18 శాతం వరకు తగ్గడం విశేషం. మార్చి, ఏప్రిల్ నెలల్లో గణనీయంగా పెరిగిన ధరలు ఇప్పుడు ఐదు వారాల కనిష్ట స్థాయికి చేరాయి.
వివరాలు
చమురు రవాణాను తిరిగి ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్..
ఈ ధరల పతనానికి ప్రధాన కారణంగా హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్ అంగీకరించడం భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, ఎల్ఎన్జీ (LNG)లో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఇటీవల నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతంలో రవాణా నిలిచిపోయింది. అయితే వచ్చే నెలలోపు సాధారణ వాణిజ్య నౌకాయానాన్ని పునరుద్ధరిస్తామని ఇరాన్ ప్రకటించడంతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే సుమారు 4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోసుకెళ్తున్న రెండు విదేశీ సూపర్ ట్యాంకర్లు ఈ మార్గంలో విజయవంతంగా ప్రయాణించాయి.
వివరాలు
శాంతి ఒప్పందం ఖరారుకావడానికి మరికొన్ని రోజులు..
అమెరికా, ఇరాన్ దేశాలు 60 రోజులపాటు కాల్పుల విరమణ పాటించేందుకు ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరు దేశాలు శాంతియుత చర్చలు కొనసాగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచే దిశగా ఇరాన్ కట్టుబడి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే అమెరికాతో పరోక్ష చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఇరాన్కు చెందిన ఒక అధికారి వెల్లడించారు. మరోవైపు పూర్తి స్థాయి శాంతి ఒప్పందం ఖరారుకావడానికి ఇంకొన్ని రోజులు పట్టే అవకాశముందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు.