WinZO: మనీలాండరింగ్ కేసులో విన్జో సహ వ్యవస్థాపకులను అరెస్టు చేసిన ఈడీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారం విన్జో సహ వ్యవస్థాపకులు సౌమ్యా సింగ్ రాథోర్,పవన్ నందాను మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. బెంగళూరులోని ఈడీ జోనల్ కార్యాలయంలో విచారణ తరువాత ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని,స్థానిక కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఒక్కరోజు రిమాండ్ విధించింది. విన్జోపై ఈడీ చేసిన ఆరోపణల్లో,భారత ప్రభుత్వం రియల్ మనీ గేమింగ్పై నిషేధం విధించిన తర్వాత కూడా గేమర్లకు తిరిగి ఇవ్వాల్సిన రూ.43 కోట్లు కంపెనీ వద్దే "రిఫండ్ చేయలేదని" పేర్కొంది. అలాగే విన్జో,గేమ్జ్క్రాఫ్ట్ కార్యాలయాలపై పీఎంఎల్ఏ (PMLA) కింద దాడులు నిర్వహిస్తూ,అసలు మనుషుల స్థానంలో ఆల్గోరిథమ్లతో ఆడించినట్లు,"అనైతిక కార్యకలాపాలు, మోసపూరిత పద్ధతులు" కొనసాగించినట్లు ఈడీ ఆరోపించింది.
వివరాలు
యూఎస్, సింగపూర్లకు పెట్టుబడుల పేరుతో మళింపు
భారత నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, బ్రెజిల్, అమెరికా, జర్మనీ దేశాల్లోనూ భారత్ నుంచే రియల్ మనీ గేమ్లను నడిపినట్లు ఈడీ వెల్లడించింది. అంతేకాదు, కంపెనీకి చెందిన బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లతో కలిపి రూ.505 కోట్ల ఆస్తులను కూడా ఫ్రీజ్ చేసినట్టు తెలిపింది. భారత సంస్థ నుంచి నిధులను యూఎస్, సింగపూర్లకు పెట్టుబడుల పేరుతో మళ్లించారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విన్జో ప్రతిస్పందిస్తూ, "మా ప్లాట్ఫారం రూపకల్పనలో పారదర్శకత, న్యాయం ప్రధానమైనవి. వినియోగదారుల భద్రతకే మా ప్రాధాన్యం" అంటూ, తాము అన్ని చట్టాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నామని స్పష్టం చేసింది.