Petrol Prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. పెట్రోల్ ధరపై రూ.10 పెరిగే అవకాశం..?
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటరు పెట్రోల్, డీజిల్పై సగటున రూ.3 చొప్పున పెంచుతూ శుక్రవారం ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇది ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్పై తీవ్ర ప్రభావం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
వివరాలు
దశలవారీగా పెంపు నిర్ణయం
ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుల ప్రకారం.. ప్రస్తుతం చమురు కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడటానికి రూ.3 పెంపు సరిపోదని, భవిష్యత్తులో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పెంపు ఒకేసారి కాకుండా, 2 నుంచి 3వారాల్లో దశలవారీగా అమలు కావచ్చని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న సంక్షోభాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తమ లాభాలను తగ్గించుకుని, పెరిగిన వ్యయభారాన్ని కొంతవరకు స్వయంగా భరించాయని సమాచారం.
వివరాలు
పెరిగిన పాల ధరలు
అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరలను రూ.3 మేర పెంచక తప్పలేదని తెలుస్తోంది. అయితే ఈ పెంపు కంపెనీల రోజువారీ నష్టాలను కొంతమేర తగ్గించిందే తప్ప పూర్తిగా నివారించలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దేశంలోని ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థలు అముల్, మదర్ డెయిరీ కూడా లీటరుకు రూ.2 చొప్పున పాల ధరలు పెంచాయి. దీంతో సాధారణ వినియోగదారుల గృహ బడ్జెట్పై అదనపు భారం పడుతోంది. ప్రాంతీయ డెయిరీ సంస్థలు కూడా త్వరలో ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంధనం, వంటగ్యాస్, పాల ధరల పెరుగుదల ప్రభావంతో రాబోయే నెలల్లో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం సుమారు 0.42 శాతం మేర పెరిగే అవకాశముందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.