
RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు!
ఈ వార్తాకథనం ఏంటి
రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి పూర్తిగా వెనక్కి తీసుకునే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ పూర్తిగా రికవరీ కాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది.
సోమవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం 2025 మే 31 నాటికి రూ.6,181 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇంకా ఆర్థిక వ్యవస్థలోనే ఉన్నాయి.
2023 మే 19న ఆర్ బి ఐ రూ.2,000 నోట్లను సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ రోజున చలామణిలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లు 100 శాతంగా పరిగణిస్తే, దాంట్లో 98.26 శాతం నోట్లు ఇప్పటికే బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.
Details
మార్చేందుకు మొదట బ్యాంకులకు అవకాశం
ప్రారంభంలో ఈ నోట్లను 2023 అక్టోబర్ 7 వరకు బ్యాంకుల ద్వారా మార్పిడి చేసుకునే లేదా ఖాతాల్లో జమ చేసుకునే అవకాశం కల్పించారు.
అనంతరం 2023 అక్టోబర్ 9 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లోనే మార్పిడి చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
ఈ మార్గంలో ప్రజలు తమ పేరిట, సంస్థల పేరిట ఆర్బీఐకి నోట్లను పంపించి తమఖాతాల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
అంతేకాక దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల ద్వారా కూడా ఆర్బీఐకి నోట్లను పంపించి నగదు పొందే అవకాశం ఉంది.
మొత్తానికి, రూ.2,000 నోట్ల రికవరీ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతున్నప్పటికీ, ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన నోట్ల రిటర్న్ ఇంకా పూర్తి కాలేదని స్పష్టమవుతోంది.