FPI outflow: ఎఫ్పీఐల అమ్మకాల జోరు.. మార్కెట్లపై ఒత్తిడి.. ఏప్రిల్లో ₹60వేల కోట్ల భారీ విక్రయాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు (FPIలు) భారీగా నిధులు ఉపసంహరిస్తున్నారు. ఎన్ఎస్డీఎల్ గణాంకాల ప్రకారం ఒక్క ఏప్రిల్ నెలలోనే రూ.60,847 కోట్ల విలువైన ఈక్విటీలను విదేశీ సంస్థాగత మదుపర్లు విక్రయించారు. ప్రస్తుత 2026 క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం రూ.1.92 లక్షల కోట్ల నిధులను వారు ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఇది 2025 మొత్తం ఏడాదిలో ఉపసంహరించిన రూ.1.66 లక్షల కోట్ల కంటే గణనీయంగా ఎక్కువ. 2026 ప్రారంభం నుంచి ఫిబ్రవరి మినహా మిగతా అన్ని నెలల్లోనూ ఎఫ్పీఐలు విక్రయాల దిశగా కదిలారు. జనవరిలో రూ.35,962 కోట్ల ఈక్విటీలను విక్రయించిన వారు, ఫిబ్రవరిలో మాత్రం రూ.22,615 కోట్లను తిరిగి భారత మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టారు.
వివరాలు
ఒక్కసారిగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు
అయితే మార్చిలో రికార్డు స్థాయిలో రూ.1.17 లక్షల కోట్లు, ఏప్రిల్లో రూ.60,847 కోట్లను మళ్లీ ఉపసంహరించుకున్నారు. ఈ భారీ విక్రయాలకు భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ స్థూల ఆర్థిక అనిశ్చితులు ప్రధాన కారణాలుగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో పెరిగిన ఘర్షణ వాతావరణం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా ప్రిన్సిపల్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయం ప్రకారం, సమీప భవిష్యత్లో వడ్డీ రేట్లలో కోతలు ఉండకపోవడం, అంతర్జాతీయంగా బాండ్ యీల్డ్స్ అధిక స్థాయిలో కొనసాగడం ఎఫ్పీఐల ఆసక్తి తగ్గడానికి దారితీస్తోంది.
వివరాలు
ఎఫ్పీఐ ఇన్ఫ్లోలు మళ్లీ పెరిగే అవకాశం
ఇక ఏంజిల్ వన్ సీనియర్ అనలిస్ట్ వకార్ జావేద్ ఖాన్ అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 90 డాలర్ల దిగువకు వస్తే ఎఫ్పీఐ ఇన్ఫ్లోలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, విదేశీ మదుపర్ల విక్రయాల మధ్య దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIలు) మార్కెట్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వారు సుమారు రూ.1.7 లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.