Gold-silver imports: అంతర్జాతీయ ధరల ప్రభావం: తగ్గిన బంగారం దిగుమతులు, తగ్గేదేలే అంటున్న వెండి..!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ఎగసిపోతున్నప్పటికీ, భారత్లోకి బంగారం-వెండి దిగుమతులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అయితే బంగారం విషయంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించడంతో దిగుమతులు తగ్గుముఖం పట్టగా, వెండి కొనుగోళ్లు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు (9నెలలు) గణాంకాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఆ గణాంకాల ప్రకారం,ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో దేశంలో బంగారం ధరలు సగటున సుమారు 25శాతంపెరిగాయి. ధరల పెరుగుదల ప్రభావంతో బంగారం దిగుమతులు తగ్గి,9 నెలల వ్యవధిలో 18.3శాతం క్షీణించి 522 టన్నులకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే విలువ పరంగా చూస్తే బంగారం దిగుమతుల బిల్లు స్వల్పంగా 1.8శాతం పెరిగి 49.4బిలియన్ డాలర్లకు చేరినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వివరాలు
వెండికి ప్రజల నుంచి అలాగే పరిశ్రమల నుంచి కూడా గట్టి డిమాండ్
ఇదే సమయంలో వెండి ధరలు సగటున 46.7 శాతం పెరిగినా, దిగుమతులు మాత్రం భారీగా పెరిగాయి. ఈ కాలంలో వెండి దిగుమతులు 56 శాతం ఎగబాకి 5,727 టన్నులకు చేరాయి. విలువ పరంగా ఈ దిగుమతులు 7.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే 9 నెలల కాలంలో నమోదైన 3.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే, ఈ మొత్తం దాదాపు రెట్టింపు కావడం విశేషం. బంగారాన్ని ప్రధానంగా పెట్టుబడి సాధనంగా మాత్రమే చూడగా, వెండికి ప్రజల నుంచి అలాగే పరిశ్రమల నుంచి కూడా గట్టి డిమాండ్ ఉండటమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.